🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబది యేడవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

నలుబది యేడవ అధ్యాయము

వీరభద్రప్ప – చెన్నబసప్పల (పాము-కప్ప) కథ

గత అధ్యాయములో రెండు మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను.

ఈ అధ్యాయమున కూడ అట్టి పూర్వ వృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు, చెన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదుము.

శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారివైపు దృష్టి నిగిడించినచో యెన్నో గతజన్మల విచారములను నశింపజేసి, యెంతో పుణ్యము ప్రాప్తించునటుల జేయును.

వారి దయాదృష్టి మనపై బరపినచో, మన కర్మ బంధములు వెంటనే విడిపోయి మన మానందమును పొందెదము.

గంగానదిలో స్నానము చేయువారి పాపములన్నియు తొలగును. అట్టి పావనమైన నది కూడ యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి, తనలో ప్రోగైన పాపములన్నియు వారి పాదధూళిచే పోగొట్టెదరాయని యాతురతతో జూచును.

యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియును. యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి. పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు.

వీరభద్రప్ప – చెన్నబసప్పల (పాము – కప్ప) కథ :

సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడగెను :

”ఒకనాడుదయము ఉపాహారము ముగించిన తరువాత వ్యాహ్యాళికి పోయి యొక చిన్న నది యొడ్డున చేరితిని. అలసిపోవుటచే నచట విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుగుకొని స్నానము చేసి హాయిగా కూర్చొని యుంటిని.

అచట చెట్ల నీడలున్న కాలిత్రోవ, బండిత్రోవ రెండును కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప యొకటి బెకబెక లాడుట వింటిని.

చెకుముకిరాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణీకుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో నాహ్వానించెను.

అతడు చిలుము వెలిగించి నాకందజేసెను. కప్ప బెకబెక మనుట తిరిగి వినిపించెను. అతడు అదేమియో తెలిసికొనగోరెను.

‘ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలము ననుభవించుచున్నద’ ని చెప్పితిని. గతజన్మలో చేసినదాని ఫలము నీ జన్మలో ననుభవించి తీరవలయును. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు.

వాడు చిలుమును బీల్చి నాకందజేసి తానే స్వయముగా పోయి చూచెదనని చెప్పెను.

ఒక కప్ప పాముచే పట్టుకొనబడి యరచుచుండెననియు గతజన్మలో రెండును దుర్మార్గులే గాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును యీ దేహముతో ననుభవించుచున్నవనియు చెప్పితిని.

అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్దపాము ఒక కప్పను నోటితో బట్టుకొని యుండుట జూచెను.

”అతడు నావద్దకు వచ్చి 10, 12 నిముషములలో పాము కప్పను మ్రింగునని చెప్పెను.

నేనిట్లంటిని. ‘లేదు. అట్లు జరుగనేరదు. నేనే దాని తండ్రిని (రక్షకుడను) ! నేనిచటనే యున్నాను. పాము చేత కప్ప నెట్లు తినిపించెదను ? నేనిక్కడ ఊరకనే యున్నానా ? దాని నెట్లు విడిపించెదనో చూడు”.

చిలుము పీల్చిన పిమ్మట మేమా స్థలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడ దగ్గరకు పోవద్దని హెచ్చరించెను.

పాము మీదపడి కరచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు బోయి యిట్లంటిని.

”ఓ వీరభద్రప్పా ! నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపపడుట లేదా ? నీవు సర్పజన్మమెత్తినప్పటికిని వాని యందు శత్రుత్వము వహించి యున్నావా ? ఛీ, సిగ్గులేదా ! మీ ద్వేషములను విడచి శాంతింపుడు”.

ఈ మాటలు విని యా సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యెను. కప్ప కూడ గంతువేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను.

‘మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదలి యదృశ్యమయ్యెను ? వీరభద్రప్ప యెవరు ? చెన్నబసప్ప యెవరు ? వారి శత్రుత్వమునకు కారణమేమి ?’ అని యతడు ప్రశ్నింపగా,

నతనితో కలసి చెట్టు మొదటికి పోయితిని. చిలుము కొన్ని పీల్పులు పీల్చి నతనికి వృత్తాంతమంతయు నీ రీతిగా బోధించితిని.

”మా యూరికి 4, 5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము గలదు. అది పాతబడి శిథిలమయ్యెను.

ఆ గ్రామములోని ప్రజలు దానిని మరామతు చేయుటకై కొంత ధనము ప్రోగుచేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజకొరకు తగిన యేర్పాటు చేసిరి.

మరామతు చేయుట కంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై బెట్టిరి.

వాడు పరమలోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము చేసెను. దేవాలయములో నేమి యభివృద్ధి కానరాలేదు.

అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను. కొంత తాను మ్రింగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తియ్యని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండుటకేవో కారణములు చెప్పెడివాడు.

గ్రామస్థులు తిరిగి వానివద్దకు బోయి అతడు సొంతముగా తగిన ధనసహాయము చేయని యెడల మందిరము వృద్ధికాదని చెప్పిరి.

వాని అంచనా ప్రకారము పనిసాగించవలసినదని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలుచేసి యాతని కిచ్చిరి. వాడ ధనమును పుచ్చుకొని, పూర్వమువలెనే యూరక కూర్చుండెను.

కొన్నాళ్ళ పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో గనిపించి యిట్లు చెప్పెను. ‘నీవు లేచి దేవాలయపు శిఖరమును గట్టుము. నీవు ఖర్చు పెట్టినదానికి 100 రెట్లు ఇచ్చెదను’.

ఆమె యీ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో యని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమనియు, దానిని నమ్మనవసరము లేదనియు,

లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో గనపడి యేల చెప్పలేదనియు, తాను మాత్రము దగ్గర లేకుండెనా యనియు, ఇది దుస్సప్నమువలె గనిపించుచున్నదనియు,

భార్యాభర్తలకు విరోధము కల్పించునటుల తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పెను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చెను.

దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాల యందు దేవునకు ఇష్టముండదు. భక్తితోను, ప్రేమతోను మన్ననతోను ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకయిన దైవ మిష్టపడును.

కొన్ని దినముల పిమ్మట దేవుడమెకు స్వప్నములో తిరిగి కనిపించి యిట్లనెను. ”భర్త దగ్గరనున్న చందాల గూర్చి చికాకు చెంద నవసరము లేదు.

దేవాలయము నిమిత్తమేమైన వ్యయము చేయుమని యాతని బలవంతము చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతము దేదైన ఇవ్వవలెను”.

ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తన కిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను.

ఆ లోభి యీ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడ మోసము చేయ నిశ్చయించుకొనెను.

ఆమె నగలనెంతో తక్కువ ధర కట్టి 1000 రూపాలకు తానే కొని, నగదునకు బదులుగా నొక పొలమును దేవదేయముగా నిచ్చెను.

అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతము గాదు. అదియొక పేదరాలగు డుబ్కీ యనునామెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదవ పెట్టి యుండెను.

ఆమె దానిని తీర్చలేకపోయెను. ఆ టక్కరి లోభి తన భార్యను, డుబ్కీని, దైవమును అందరిని మోసగించెను.

ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది. దాని విలువ చాలా తక్కువ. దానివలన ఆదాయమేమియు లేదు.

ఈ వ్యవహారమిట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి యధీనములో నుంచిరి. అందులకతడు సంతసించెను.

కొన్నాళ్ళకు ఒక చిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోభి యింటికి పిడుగుపాటు తగిలి వాడు, వాని భార్య చనిపోయిరి. డుబ్కీ కాలగతి చెందెను.

తరువాతి జన్మలో ఆ లోభి మథురాపట్టణములో నొక బ్రాహ్మణ కుటుంబములో పుట్టి వీరభద్రప్పయను పేర నుండెను.

అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరి యని పేరు పెట్టిరి. డుబ్కీ మందిర గొరవనింటిలో మగశిశువుగా జన్మించెను. అతనికి చెన్నబసప్ప యని నామమిడిరి.

ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చెడివాడు. అతని కుమార్తె గౌరి కూడ నా భక్తురాలు.

ఆమె త్వరగా నెదుగుచుండెను. ఆమె తండ్రి వరునికై వెదకుచుండెను. ఆ విషయమై చికాకుపడ నవసరము లేదనియు, ఆమె భర్త తానై వెదకుకొని వచ్చుననియు నేను చెప్పితిని.

కొన్నాళ్ళకు వీరభద్రప్పయను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి యింటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరినిచ్చి పెండ్లి చేసెను.

అతడు కూడ నా భక్తుడయ్యెను. ఏలన పిల్లను కుదిర్చితినని అతడు నాయందు విశ్వాసము చూపుచుండెను.

వాడు ఈ జన్మలో కూడ ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి యాతడు కుటుంబముతో నుండుటచే తన కెక్కువగా ధనము వచ్చునట్లు చేయుమని బతిమాలు చుండెను.

ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరి యదృష్టము కొలది పొలమునకు ధర పెరిగెను.

కానుకగా నిచ్చిన పొలము ఒక లక్ష రూపాయల కమ్మిరి. ఆమె యాభరణముల విలువకు 100 రెట్లు వచ్చెను.

అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి.

అందుకందరు సమ్మతించిరి. కాని ధనమునకై తగవులాడిరి. సలహాకొరకు నావద్దకు వచ్చిరి.

ఆ యాస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి వచ్చెను.

ఆమె సమ్మతి లేనిదే యేమీ ఖర్చు చేయవద్దని చెప్పితిని. ఆమె భర్తకు ఈ పైకముపై నెట్టి యధికారము లేదని బోధించితిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను.

ఆస్తిపై గౌరికే హక్కు గలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకొంటిని.

వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే నామె పగటి పూట నా వద్దకు వచ్చి యితరుల మాటలు పట్టించుకొనవలదనియు తనను కూతురుగా జూచుకొనవలెననియు వేడుకొనెను.

ఆమె నాయాశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు సప్త సముద్రములైన దాటుదునని వాగ్దానమిచ్చితిని.

ఆనాడు రాత్రి గౌరి కొక స్వప్నదృశ్యము గనపడెను. మహాదేవుడు స్వప్నములో గనిపించి యిట్లనెను.

”ధనమంతయు నీదే. ఎవరికి నేమియును ఇవ్వవలదు. చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరామతు నిమిత్తము కొంత ఖర్చు చేయుము.

ఇతరములకై వ్యయము చేయవలసి వచ్చునప్పుడు మసీదులో నున్న బాబా సలహా తీసుకొమ్ము”. గౌరి నాకీ వృత్తాంతమంతయు దెలిపెను. నేను తగిన సలహా నిచ్చితిని.

అసలు తీసికొని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్ప కివ్వుమనియు వీరభద్రప్ప కిందులో జోక్యము లేదనియు నేను గౌరికి సలహా నిచ్చితిని.

నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంతవరకు వారిని సమాధానపరచితిని.

గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పితిని. వీరభద్రప్ప మిగుల కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదరించెను. చెన్నబసప్ప పిరికివాడు.

వాడు నా పాదములు పట్టి నన్నే యాశ్రయించెను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడెదనని నేను వానికి వాగ్ధానము చేసితిని.

కొంత కాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను; చెన్నబసప్ప కూడ చనిపోయి కప్పగా జన్మించెను.

చెన్నబసప్ప బెకబెకలాడుట విని, నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి దెచ్చుకొని, ఇక్కడకు వచ్చి వానిని రక్షించి, నా మాటను పాలించుకొంటిని.

భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరుగెత్తును. భగవంతుడు నన్నిచటకు బంపి చెన్నబసప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల.

నీతి :

ఈ కథవల్ల మనము నేర్చుకొనిన నీతి యేమనగా ఎవరు చేసిన దానిని వారే యనుభవించవలెను.

ఇతరులతో గల సంబంధము లన్నిటిని, బాధను కూడ అనుభవించవలెను. తప్పించుకొను సాధనము లేదు.

తనకెవరితోనైన శత్రుత్వమున్న యెడల దానినుండి విముక్తిని పొందవలెను. ఎవరికైన ఏమైన బాకీయున్న దానిని తీర్చివేయవలెను.

ఋణముగాని శతృత్వ శేషము గాని యున్నచో దానికి తగిన బాధపడవలెను. ధనమునందు పేరాస గలవాని నది హీనస్థితికి దెచ్చును. తుట్టతుదకు వానికి నాశము కలుగజేయును.

నలుబది యేడవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above text has been typed by: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles