🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబది తొమ్మిదవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

నలుబది తొమ్మిదవ అధ్యాయము

ప్రస్తావన; హరి కానోబా; సోమదేవస్వామి; నానాసాహెబు చాందోర్కరు

ప్రస్తావన :

వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మావంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు ?

ఈ విషయములో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును.

కాని సాయిబాబా సుగుణములను జూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును.

మన స్నేహితులు గాని, బంధువులుగాని మనతో లేకున్నచో మంచి పిండివంటలు కూడ రుచింపవు. కాని వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును.

సాయిలీలామృతము కూడ అట్టిదే. దీనిని మన మొంటరిగా తినలేము. స్నేహితులు, బంధువులు కలిసినచో చాల బాగుగా నుండును.

ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి యిష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్య శరణాగతి యొనర్చి వారియందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము.

తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానములకంటె తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటె మేలు. సద్గురుని ధ్యానించుట యన్నిటికంటె మేలయినది.

కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు, వారి యాకారమును మనస్సున భావించుకొనుచు, వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో, వారికొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను.

సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు.

పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో, సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును. తుదకు మోక్షము నిచ్చును.

ఇక నీ యధ్యాయములోని కథలవైపు మరలుదము.

హరి కానోబా :

హరి కానోబా యను బొంబాయి పెద్ద మనుష్యుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీల లనేకములు వినెను, కాని నమ్మలేదు.

కారణమేమన అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలెనని యతని కోరిక.

కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాగా యుండెను. అతని పాదములకు క్రొత్త చెప్పులుండెను.

కొంతదూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు బోయి సాష్టాంగ నమస్కారము చేయవలె ననుకొనెను. క్రొత్త చెప్పులెచట నుంచవలెనో అతనికి తెలియలేదు.

చెప్పులు మసీదు ముందొక మూలన బెట్టి బాబా దర్శనమునకు బోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదీని, ప్రసాదమును బాబా చేతి నుండి యందుకొని తిరిగివచ్చెను.

మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనపించలేదు. చెప్పుల కొరకు వెదకెను. కాని నిష్ప్రయోజనమయ్యెను. చాల చికాకు పడుచు బసకు వచ్చెను.

అతడు స్నానము చేసి, పూజచేసి, నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. కాని తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను.

భోజనానంతరము, చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుఱ్ఱవాడు తనవైపు వచ్చుట చూచెను.

ఆ కుఱ్ఱవాని చేతిలో నొక కఱ్ఱ యుండెను. దాని చివరన క్రొత్త చెప్పుల జత వ్రేలాడుచుండెను.

చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను బంపెననియు వీధిలో ‘హరీకా బేటా, జరీకా ఫేటా’యని యరచుమనియు చెప్పెననెను.

ఎవరయిన ఆ చెప్పులు తమవే యన్నచో నతని పేరు హరి యనియు, నతడు కానోబా కొడుకనియు, అతని తలపై జరీపాగా గలదా యను సంగతి పరీక్షించిన తరువాత చెప్పుల నిచ్చివేయుమని చెప్పెననెను.

ఈ కుఱ్ఱవాడిట్లు చెప్పుట విని, హరి కానోబా యాశ్చర్యానందములు పొందెను. కుఱ్ఱవాని వద్దకు బోయి చెప్పులు తనవని రూఢి చేసెను.

అతడు తన పేరు హరి యనియు, తాను కానోబా కుమారుడననియు తన తలపై ధరించు జరీపాగాను చూపెను.

ఆ కుఱ్ఱవాడు సంతృప్తి జెంది చెప్పుల నిచ్చివేసెను. హరి కానోబా మిక్కిలి యాశ్చర్యపడెను.

తన జల్తారుపాగా యందరికి కనిపించవచ్చునుగాని, తన పేరు, తన తండ్రి పేరు బాబా కెట్లు దెలిసెను ? అదియే షిరిడీకి మొదటిసారి తన రాక.

అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయము వల్ల నాతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను.

అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. సంతోషముతో నింటికి పోయెను.

సోమదేవస్వామి :

బాబాను పరీక్షించుటకై యింకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబు దీక్షిత్‌ తమ్ముడు భాయీజీ నాగపూరులో నివసించుచుండెను.

1906వ సంవత్సరములో హిమాలయమునకు బోయినప్పుడు సోమదేవస్వామి యను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు.

వారి మఠము హరిద్వారములో గలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసికొనిరి.

5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి భాయీజీ యింట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను.

షిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతనికి గట్టికోరిక కలిగెను. భాయీజీ వద్దనుంచి పరిచయపుటుత్తరమును దీసికొని షిరిడీకి పోయెను.

మన్మాడు, కోపర్‌గాం దాటిన పిమ్మట టాంగా చేసికొని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై రెండు పెద్ద జండాలు కనిపించెను.

సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోను వేర్వేరు జీవనపద్ధతులతోను, వేర్వేరు బాహ్యాలంకారములతోను ఉందురు.

కాని యీ పై పై గుర్తులను బట్టి యే యోగి యొక్క గొప్పదనమును గనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంథాగా దోచెను.

రెండు పతాకము లెగురుట చూడగనే తనలో తాను ”ఈ యోగి జండాల యందేల మక్కువ జూపవలెను ? అది యోగికి తగినది కాదు.

దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది” అనుకొనెను.

ఇట్లు ఆలోచించుకొని, షిరిడీకి పోవుట మానుకొన నిశ్చయించినట్లు తనతోనున్న యితర యాత్రికులకు జెప్పెను.

వారతనితో నిట్లనిరి. ”అట్లయిన ఇంత దూరము వచ్చితివేల ? జండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుఱ్ఱము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు ?”

సోమదేవస్వామి గాభరా పడి యిట్లనెను. ”గుఱ్ఱములతోను, పల్లకీతోను, జట్కాలతోను గల సాధువులను నేనెచ్చట జూచి యుండలేదు. అట్టి సాధువులను చూచుట కంటె తిరిగి పోవుటయే మేలు” అనెను.

ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను. తక్కిన తోటి ప్రయాణీకులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీ లోనికి బొమ్మనిరి. అట్టి వక్రాలోచనను మానుమనిరి.

బాబా యా జండాలను కాని తక్కిన వస్తువులనుగాని, ఆడంబరములను గాని, కీర్తినిగాని లక్ష్యపెట్టనివారని చెప్పిరి.

అవన్నియు నలంకరించినవారు బాబా భక్తులేగాని ఆయనకేమి యవసరముగాని సంబంధముగాని లేదనిరి. వారి భక్తి , ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి.

తుట్టతుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు జేసిరి.

సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగనే అతని మనస్సు కరగెను. అతని కండ్లు నీటిలో నిండెను; గొంతుక యార్చుకొని పోయెను. అతని కుంటి యాలోచనలన్నియు నడుగంటి పోయెను.

”ఎచ్చట మనస్సు శాంతించి యానందమును పొంది యాకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము” అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి దెచ్చుకొనెను.

అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా

”మా వేషము మా దగ్గరనే యుండనీ, నీ యింటికి నీవు పొమ్ము. తిరిగి మసీదుకు రావద్దు. ఎవరయితే మసీదుపై జండా నెగురవైచుచున్నారో యట్టివారి దర్శనము చేయనేల ? ఇది యోగి లక్షణమా ? ఇక్కడొక నిమిషమయిన ఉండవద్దు” అనెను.

ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించు చున్నారని తెలిసికొనెను.

అతడెంత సర్వజ్ఞుడు ! తాను తెలివి తక్కువవాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను.

బాబా యందరిని కౌగలించుకొనుట, కొందరిని యాశీర్వదించుట, కొందరిని యోదార్చుట, కొందరివైపు దాక్షిణ్యముతో జూచుట, కొందరివైపు చూచి నవ్వుట,

ఊదీ ప్రసాదమును కొందరికిచ్చుట, యిట్లు అందరిని ఆనందింపజేసి, సంతృప్తి పరచుట జూచి తన నొక్కరినే యేల యంత కఠినముగ జూచుచుండెనో అతనికి తెలియకుండెను.

తీవ్రముగా నాలోచించి బాబా చేయునదంతయు తన యంతరంగమున నున్న దానితో సరిగా నుండెనని గ్రహించెను.

దానివల్ల పాఠము నేర్చుకొని వృద్ధిపొందుటకు యత్నించవలెనని గ్రహించెను. బాబా కోపము మారు రూపముతో నున్న యాశీర్వాదమే యనుకొనెను.

కొన్నాళ్ళ పిమ్మట బాబా యందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను.

నానాసాహెబు చాందోర్కరు :

ఈ యధ్యాయమును హేమాడ్‌పంతు నానాసాహెబు చాందోర్కరు కథతో ముగించెను.

ఒకనాడు నానాసాహెబు మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చొని యుండగా బీజాపూరు నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను జూచుటకు వచ్చెను.

అతనితో ఘోషా స్త్రీ లుండుటచే నానాసాహెబు అచ్చట నుంచి లేవనెంచెను. కాని బాబా యాతనిని వారించెను.

స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసికొనిరి. అందులో నొక స్త్రీ ముసుగు దీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసికొనెను.

నానాసాహెబు ఆమె ముఖ సౌందర్యమును చూచి మరల చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును జూచి, స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట, బాబా నానాతో నిట్లనెను.

”నానా ! అనవసరముగా చికాకు పడుచుంటివేల? ఇంద్రియములను వాని పనులను జేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగజేసికొనగూడదు.

దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు, గాన అందరిని చూచి సంతసించుట మన విధి.

క్రమముగాను, మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచియుండగా వెనుక ద్వారము గుండ పోనేల ?

మన హృదయము స్వచ్ఛముగా నున్నంతవరకు నేమియు దోషము లేదు. మనలో చెడ్డ యాలోచన లేనప్పుడితరులకు భయపడనేల ?

నేత్రములు వాని పని యవి నెరవేర్చు కొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేల ?”

శ్యామా యచ్చటనే యుండెను. కాని బాబా చెప్పినదానిని గ్రహించలేక పోయెను. ఇంటికి పోవు దారిలో శ్యామా ఆ విషయమై నానా నడిగెను.

ఆ చక్కని స్త్రీ వైపు జూచి తాను పొందిన యా చంచలత్వమును గూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి యెట్లు సలహానిచ్చెనో వివరించెను.

బాబా చెప్పిన దాని భావము నానా యిట్లు చెప్పదొడంగెను. ‘మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించునట్లు చేయరాదు.

ఇంద్రియములు చలింపవచ్చును. శరీరము స్వాధీనమునందుంచుకొనవలెను. దాని యోరిమి పోవునట్లు చేయరాదు.

ఇంద్రియములు విషయములవైపు పరుగెత్తును. కాని మనము వానివెంట పోరాదు. మనము ఆ విషయములను కోరగూడదు. క్రమముగాను, నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును.

ఇంద్రియములకు మనము లోబడగూడదు. కాని వానిని మనము పూర్తిగ స్వాధీనమందుంచు కొనలేము. సమయానుకూలముగా వాని నణచి సరిగా నుంచుకొనుచుండవలెను.

నేత్రము లందమైన వానిని జూచుట కొరకే యివ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును.

భయమునకుగాని, లజ్జకుగాని యవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకొనరాదు.

మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈవిధముగా నింద్రియములను సులభముగాను, సహజముగాను స్వాధీనము చేసికొనవచ్చును.

విషయములనుభవించుటలో కూడ నీవు భగవంతుని జ్ఞప్తియందుంచుకొనెదవు.

బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయములవైపు పరుగిడనిచ్చినచో, వానిపై అభిమానముండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు.

ఇంద్రియ విషయములు హానికరమయినవి. వివేకము (అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట) సారథిగా, మనస్సును స్వాధీన మందుంచుకొనవలెను.

ఇంద్రియముల నిచ్చవచ్చినట్లు సంచరింప జేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదమును చేరగలము.

అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమైన యావాసము. అచట నుండి తిరిగి వచ్చుట లేదు”.

నలుబది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above text has been typed by: Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles