శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పదవ అధ్యాయము🌹…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

ముప్పదవ అధ్యాయము

షిరిడీకి లాగబడిన భక్తులు – కాకాజీ వైద్య; రహతా కుశాల్‌చంద్‌;

పంజాబి రామలాల్‌

ఈ యధ్యాయములో బాబా షిరిడీకి ఈడ్చిన యిద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకొందము.

దయామయుడు భక్తవత్సలుడునగు శ్రీసాయికి నమస్కారము. వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు.

వారు నిర్గుణస్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తుల కాత్మసాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము.

అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరియైనది. వారి పాదముల నాశ్రయించినవారి పాపములెల్ల నశించును.

అట్టివారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్య క్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి, గాయత్రీ మంత్రమును జపించెదరు.

దుర్బలులము, పుణ్యహీనుల మగుటచే భక్తి యనగానేమో మనకు దెలియదు. మనకింత మాత్రము తెలియును.

ఇతరులు మనలను విడిచి పెట్టునప్పటికి బాబా మాత్రము మనలను విడువరు. వారి కృపకు పాత్రులైనవారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు.

భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వానిని నేరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది, కృతజ్ఞతతో నుండెదరు.

కాని మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనెదము. మా తప్పులన్నియు క్షమించి సాయి మా యారాటములన్నియు బాపుగాక.

కష్టములపాలై సాయి నీవిధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి, బాబా కటాక్షముచే వారు సంతుష్టి నందెదరు.

దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్‌పంతు ఈ గ్రంథమును వ్రాయగలిగెనని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత యెంత ? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను.

శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్‌పంతుకు కష్టముగాని, శ్రమగాని కానరాకుండెను.

తన వాక్కును, కలమును గూడ ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా నతడు సంశయముగాని, ఆరాటముగాని పొందనేల ?

అతడు వ్రాసిన యీ పుస్తకరూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది యతని గతజన్మల పుణ్యపరంపరచే ప్రాప్తించెను. కావున నాతడదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను.

ఈ క్రింది కథ సాధారణ కథ కాదు; స్వచ్ఛమైన యమృతము. దీని నెవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును దెలిసికొందురు.

వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదువ నక్కరలేదు. దీనికి కావలసినది యంతులేని ప్రేమ, భక్తి; వివాదము కాదు.

జ్ఞానులు భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకుల మనుకొనువారు, ఈ కథల నిష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలనుకొందురు.

అదృష్టవంతులు అయిన సాయిభక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును.

గృహస్థులకు సంతృప్తి కలుగును. ముముక్షువుల కిది సాధనగా నుపకరించును. ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించెదము.

కాకాజీ వైద్య :

నాసిక్‌ జిల్లా వణిలో కాకాజీ వైద్య యనువాడుండెను. అతడచటి సప్తశృంగి దేవతకు పూజారి.

అతడనేక కష్టముల పాలై మనఃశ్శాంతిని పోగొట్టుకొని చంచల మనస్కుడయ్యెను.

అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు బోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయ పూర్వకముగా వేడుకొనెను.

అతని భక్తికి దేవత సంతసించి యానాటి రాత్రి యాతనికి స్వప్నమున గాన్పించి ”బాబా వద్దకు పొమ్ము ! నీ మనస్సు శాంతి వహించు” ననెను.

ఈ బాబా యెవరో దేవి నడిగి తెలిసికొనుటకు కాకాజీ యుత్సహించెను. కాని ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా యెవరైయుండవచ్చునని అతడు యోచించెను.

కొంతసేపు ఆలోచించిన పిమ్మట యీ బాబా త్య్రంబకేశ్వరుడు (శివుడు) కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్య్రంబకము (నాసిక్‌ జిల్లా) వెళ్ళెను. అచ్చట పదిరోజులుండెను.

అక్కడున్నంత కాలము వేకువ ఝామున స్నానము చేసి, రుద్రమును జపించుచు, అభిషేకమును తదితర పూజలను గావించెను.

అయినప్పటికి మునుపటివలెనే అశాంత మనస్కుడుగా నుండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగివచ్చి దేవతను తిరిగి వేడుకొనెను.

ఆ రాత్రి ఆమె స్వప్నములో గనిపించి యిట్లనెను. ”అనవసరముగా త్య్రంబకేశ్వరమెందుకు వెళ్ళినావు ? బాబా యనగా షిరిడీ సాయిబాబా యని నా యభిప్రాయము”.

షిరిడీకి పోవుటెట్లు ? ఎప్పుడు పోవలెను ? బాబాను జూచుటెట్లు ? అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను.

ఎవరయిన యోగీశ్వరుని చూడవలె ననుకున్నచో, ఆ యోగియేగాక దైవము కూడ అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యదార్థముగా యోగియు భగవంతుడును నొకరే. వారిలో నేమియు భేదము లేదు.

ఎవరైన తానై పోయి యోగిని దర్శించుటన్నది యుత్తబూటకము. యోగి సంకల్పించనిదే వారిని జూడగలుగు వారెవరు ? అతని యాజ్ఞ లేక చెట్టు ఆకు గూడ కదలదు.

యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు జూపునో, యంత త్వరగాను, బలముగాను అతని కోరిక నెరవేరును.

దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహము లొనర్చును. కాకాజీ విషయములో అట్లే జరిగెను.

శ్యామా మ్రొక్కు :

కాకాజీ షిరిడీకి పోవుట కాలోచించుచుండగా, ఒక యతిథి అతనిని షిరిడీకి తీసికొనిపోవుట కాతని యింటికే వచ్చెను.

అతడింకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామా ఆ సమయమున వణికి ఎట్లు వచ్చెనో చూతము.

శ్యామా బాల్యములో జబ్బుపడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వణిలోని సప్తశృంగికి, ‘జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీపాదములపై బెట్టెద’నని మ్రొక్కుకొనెను.

కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడేను.

తనకు నయమైనచో రెండు వెండి కుచములు సమర్పించెదనని అప్పుడింకొక మ్రొక్కు మ్రొక్కెను. కాని ఈ రెండు మ్రొక్కులు కూడ ఆమె చెల్లించలేదు.

ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామాకు చెప్పి రెండు మ్రొక్కులు చెల్లించు భారము నాతనిపై వైచి ఆమె మృతిచెందెను.

శ్యామా కొన్నాళ్ళకు ఆ మ్రొక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరములు గడచెను.

అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములచట మకాము చేసెను. అతడు శ్రీమాన్‌ బూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా నుండెను.

శ్యామా తమ్ముడు బాపాజి జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మ్రొక్కులు చెల్లించక పోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగజేయుచున్నదనెను. బాపాజీ యీ సంగతి శ్యామాకు తెలియపరచెను.

అప్పుడు శ్యామాకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకను ఆలస్యము చేసినచో హానికరమని యెంచి శ్యామా ఒక కంసాలిని బిలిచి, రెండు వెండి కుచములు చేయించెను.

మసీదుకు బోయి బాబా పాదములపై బడి, రెండు కుచముల నచట బెట్టి, తన మ్రొక్కులను చెల్లజేయుమని, బాబాయే తన సప్తశృంగి దేవత యగుటచే వాని నామోదించుమని వేడెను.

”నీవు స్వయముగా బోయి సప్తశృంగి దేవతకు మ్రొక్కును చెల్లింపు” మని బాబా నిర్బంధించెను.

బాబా ఊదీని ఆశీర్వాదదమును పొంది, శ్యామా వణి పట్టణమునకు బయలుదేరెను. పూజారి యిల్లు వెదకుచు తుదకు కాకాజీ యిల్లు చేరెను.

అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలెనని గొప్ప కుతూహలముతో నుండెను. అట్టి సమయములో శ్యామా వారింటికి వెళ్ళెను. ఇది ఎంత యాశ్చర్యకరమైన కలయికయో చూడుడు !

‘మీరెవ్వరు ? ఎచ్చటి నుండి వచ్చినా”రని కాకాజీ యడిగెను. ”మాది షిరిడీ, నేను సప్తశృంగికి మ్రొక్కు చెల్లించుట కిక్కడకు వచ్చినా”నని శ్యామా యనెను.

షిరిడీ నుంచి వచ్చెనని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగలించు కొనెను, ప్రేమచే మైమరచెను. వారు సాయిలీలల గూర్చి ముచ్చటించుకొనిరి.

శ్యామా మ్రొక్కులన్నియు చెల్లించిన పిమ్మట వారిద్దరు షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరగనే కాకాజీ మసీదుకు బోయి బాబాను జూచి, వారి పాదములపై బడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను.

సప్తశృంగి దేవత స్వప్నములో తెలియపరచిన రీతిగా బాబాను చూడగనే అతని మనస్సులోని చంచలత్వమంతయు పోయి ప్రశాంతి వహించెను.

కాకాజీ తన మనస్సులో నిట్లనుకొనెను. ”ఏమి ఈ యద్భుతశక్తి ! బాబా యేమియు పలుకలేదు. ఉత్తర ప్రత్యుత్తరములు కూడ జరుగలేదు. ఆశీర్వచనములనైన పలుకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యెను.

వారి దర్శన మాత్రముననే నా మనశ్చాంచల్యము పోయినది. అంతరంగమున ఆనంద ముద్భవించినది. ఇదియే దర్శనభాగ్యము”.

అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని యతని సంతోషమున కంతులేకుండెను.

బాబాను సర్వస్య శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన యానందమును పొందెను.

అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది యిల్లు చేరెను.

రహతా కుశాల్‌చంద్‌ :

తెల్లవారుఝామున వచ్చిన స్వప్నము నిజమగునని యందురు. ఇది సత్యమే కావచ్చు.

కాని బాబా స్వప్నములకు కాలనియమము లేదు. ఒక ఉదాహరణము : ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబు దీక్షితును రహతాకు పోయి, చాలా రోజుల నుండి చూడకుండుటచే, కుశాల్‌చంద్‌ను తీసికొని రమ్మనెను.

ఒక టాంగాను దీసికొని కాకా రహతా వెళ్ళెను. కుశాల్‌చంద్‌ను కలిసికొని బాబా చెప్పిన వార్త నందజేసెను.

దీనిని విని కుశాల్‌చంద్‌ యాశ్చర్యపడెను. మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మనినందున నతడు షిరిడీకి పోవుటకు ఆతురతతో నున్నానని చెప్పెను.

తన గుఱ్ఱము అచ్చట లేకుండుటచే, తన కుమారుని బాబాకు ఈ సంగతి దెలుపుటకై పంపెను.

కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్‌ టాంగాను తీసికొని వచ్చెను. కుశాల్‌చంద్‌ను దీసికొని రావలసినదని బాబా దీక్షితుకు చెప్పుటచే, నిద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరిరి.

కుశాల్‌చంద్‌ బాబాను దర్శించెను. అందరు సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలలను జూచి కుశాల్‌చంద్‌ మనస్సు కరగెను.

పంజాబి రామలాల్‌ (బొంబాయి) :

ఒకనాడు బొంబాయిలో నుండు పంజాబి బ్రాహ్మణుడు రామలాల్‌ యనువాడు ఒక స్వప్నమును గాంచెను. ఆ స్వప్నములో బాబా కనపడి షిరిడీకి రమ్మనెను.

బాబా వానికి మహంతు వలె గనిపించెను కాని అతనికి వారెచట గలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలెనని మనమున నిశ్చయించెను.

కాని చిరునామా తెలియకుండుటచే చేయుట కేమియు తోచకుండెను. ఎవరినైన మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసిన వన్నియు మనము సమకూర్చెదము.

ఈ విషయములో కూడ  అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలము వీథిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటో జూచెను.

స్వప్నములో జూచిన మహంతు ముఖ లక్షణములీ పటములో నున్న వానితో సరిపోయెను. కనుగొనగా యా పటము సాయిబాబాదని తెలిసెను.

అతడు వెంటనే షిరిడీకి పోయి యచ్చటనే తన యంత్యకాలము వరకుండెను.

ఈవిధముగా బాబా తన భక్తులకు దర్శన మిచ్చుటకై షిరిడీకి తీసికొని వచ్చుచుండెను. వారి యిహపరముల కోరికలు నెరవేర్చుచుండెను.

ముప్పదవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

నాల్గవరోజు పారాయణము సమాప్తము

The above text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles