🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పది రెండవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా..సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

ముప్పది రెండవ అధ్యాయము

అన్వేషణము; గోఖలే గారి భార్య – ఉపవాసము; బాబా సర్కారు

ఈ యధ్యాయములో హేమాడ్‌పంతు రెండు విషయములను వర్ణించెను.

  1. బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను; వారి ద్వారా దైవమును ఎట్లు గనెను.
  2. గోఖలేవారి భార్య మూడురోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా నామెచే బాబా యెట్లు ఉపవాసదీక్ష మాన్పించెను.

ప్రారంభమున హేమాడ్‌పంతు సంసారమును అశ్వత్థవృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్ళు పైన, కొమ్మలు క్రింద గలవలెను.

దాని కొమ్మలు క్రింది వైపు మీది వైపు గూడ వ్యాపించియున్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి.

దాని యంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించి యున్నవి.

దాని స్వరూపము గాని, దాని యాధారము గాని, దాని యాద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు.

వైరాగ్యమను పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్ళుగల అశ్వత్థ వృక్షమును నరికి, ఏ యతీత మార్గము ననుసరించిన తిరిగి జన్మలేదో యట్టి దాని ననుసరించవలెను.

అట్టి దారియందు నడచుటకు, దారిచూపు మంచి గురువు సహాయము మిక్కిలి యవసరము.

అతడెంత పండితుడైనప్పటికి వేదవేదాంగములను బాగుగ చదివినప్పటికిని, తన గమ్యస్థానమునకు సురక్షితముగ పోలేడు.

మార్గదర్శియే యుండి సహాయపడి సరియైన దారి చూపినచో, మార్గములో నున్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును.

ఈ విషయములో బాబా యనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడచుకొన్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును.

అన్వేషణము :

ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలిడితిమి.

మాలో నొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను గాని యితరులపై నాధారపడరాదు అనెను.

అందుకు రెండవవాడు మనస్సును స్వాధీనమందుంచుకొన్నవాడే ధన్యుడనియు మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటె వేరైనది ఈ ప్రపంచములో మరేదియు లేదని చెప్పెను.

మూడవవాడు దృశ్య ప్రపంచము సదాపరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణ మవసరమనియు చెప్పెను.

నాలుగవవారు (అనగా బాబా) ”పుస్తక జ్ఞానమెందుకు పనికిరానిది. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తిచేసి, తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై బెట్టి శరణు వేడవలెను.

గురువే దైవము; సర్వమున వ్యాపించినవాడు, ఇట్టి ప్రత్యయ మేర్పడుటకు, దృఢమైన యంతులేని నమ్మకమవసరము” అనెను.

ఈ ప్రకారముగా తర్కించుచు, మేము నలుగురు పండితులము భగవంతుని వెదకుట కడవులలో తిరుగ నారంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధి నుపయోగించి వెదక నిశ్చయించిరి.

దారిలో ఒక వర్తకుడు (బంజారా) మమ్ములను కలిసి ”ఇప్పుడు చాలా ఎండగా నున్నది. ఎంత దూరము పోవుచున్నారు. ఎక్కడికి పోవుచున్నా”రని యడిగెను.

అడవులు వెదకుట కని మేము జవాబిచ్చితిమి.  ఏమి వెదకుటకు పూనుకొంటిరని యతడు తిరిగి అడిగెను.

ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి యతడు కనికరించి యిట్లనెను.

”అడవుల సంగతి పూర్తిగ తెలియకుండ మీ యిష్టము వచ్చినట్లు తిరుగరాదు. అడవులలో సంచరింపదలచినచో మీ వెంట నొక మార్గదర్శి యుండియే తీరవలెను.

అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాస పడెదరెందుకు ? మీ రహస్యాన్వేషణము నాకు జెప్పనక్కరలేదు.

అయినను మీరు కూర్చుండి, భోజనము చేసి, నీళ్ళు త్రాగి కొంత విశ్రాంతి దీసికొని పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండు”డనెను.

అతడంత మృదువుగా మాట్లాడినను, వానిని నిరాకరించి నడవ సాగితిమి. మాకన్ని సంగతులు దెలియును కాన ఇతరుల సహాయమక్కరలేదను కొంటిమి.

అడవులు పెద్దవి, మార్గములు లేనివి. చెట్లు దగ్గరగాను, ఎత్తుగాను నుండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి యటు నిటు చాలసేపు తిరిగితిమి.

తుట్టతుద కెక్కడనుండి బయలుదేరితిమో యచ్చటికే యదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి.

బంజారా తిరిగి కలిసికొని యిట్లనెను. ”మీ తెలివితేటలపై నాధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికిగాని పెద్దదానికి గాని సరియైన మార్గము చూపుటకొక మార్గదర్శి యుండియే తీరవలెను.

ఉత్తకడుపుతో ఏ యన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో నెవ్వరు కలియరు.

పెట్టిన భోజనము వద్దనకుడు. వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు. భోజన పదార్థము లర్పించుట శుభసూచకము”. ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయుమని బతిమాలెను.

నా మిత్రులు ముగ్గురు ఈ మాటలను లక్ష్యపెట్టక, భోజనము చేయకుండ ప్రయాణము సాగించిరి.

వారి హఠమావిధముగా నుండెను. నేనుమాత్ర మాకలితోను దాహముతోను నుంటిని. బంజారా చూపిన యసామాన్య ప్రేమకు లొంగిపోతిని.

మేమెంతో తెలివైనవారమనుకొంటిమి కాని, దయా దాక్షిణ్యములకు దూరమయితిమి.

బంజారా చదువుకొన్నవాడు కాడు; యోగ్యతలు లేనివాడు; తక్కువజాతివాడు. కాని వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయుమని మమ్ముల వేడెను.

ఈ విధముగా ఫలాపేక్ష లేకుండ ఎవరయితే యితరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని యెంచి వాని యాతిథ్యము నామోదించుటయే జ్ఞానమునకు ప్రథమసోపానమని యనుకొంటిని.

మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని (అనగా బాబా) నీళ్ళు త్రాగితిని.

ఏమి యాశ్చర్యము ! వెంటనే మా గురువుగారు వచ్చి మా యెదుట నిలచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరచితిని.

అప్పుడు వారు ‘నాతో వచ్చుట కిష్టపడెదరా ? మీకు కావలసిన దేదో నేను జూపెదను. నాయందు విశ్వాసమున్న వారికే జయము కలుగును” అనిరి.

తక్కినవారు వారి మాటలకు సమ్మతింపక యెక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవ పూర్వకముగా నమస్కరించి వారి యాజ్ఞకు లోబడితిని.

అంతట వారు నన్నొక బావి వద్దకు దీసికొని పోయిరి. నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్ళకు మూడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసిరి.

నా చేతులతో గాని, నోటితోగాని నీళ్ళను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధముగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి.

4, 5 గంటల తరువాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయిటికి దీసి యెట్లుంటివని యడిగిరి.

”ఆనందములో మునిగియుంటిని, నేను పొందిన యానందమును నా వంటి మూర్ఖుడేట్లు వర్ణించగలడు !” అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతుష్టి చెందిరి.

నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి.

తల్లిపక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా జూచునట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి.

అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా యభిమాన మంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను.

గురువుగారి మెడను కౌగిలించుకొని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడు చూచుచుండవలె ననిపించినది.

వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలనిపించెడిది. అది యటువంటి బడి.

అందులో ప్రవేశించిన వారెవరును రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగ తోచుచుండెను. నా యిల్లు నా యాస్తి నా తల్లిదండ్రులు అంతయు వారే.

నా యింద్రియములన్నియు తమ తమ స్థానములు విడిచి, నా కండ్ల యందు కేంద్రీకృతమయ్యెను; నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను. నా ధ్యానమంతయు నా గురువుపైననే నిల్పితిని.

నాకింకొక దానియందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనసు నా బుద్ధి స్తబ్ధమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని.

ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు.

తుట్టతుదకు పశ్చాత్తాప పడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్యశక్తిని గురించి తన ఋజువర్తనము గూర్చి పొగడుకొనుచు తన పావిత్య్రమును ప్రదర్శించునే కాని, హృదయము మృదువుగా నుండదు.

అతడనేక విషయముల గూర్చి మాట్లాడును. తన మహిమను తానే పొగడుకొనును. కాని యతని మాటలు భక్తుల హృదయమందు నాటవు, వారిని ఒప్పింపజేయవు.

ఆత్మ సాక్షాత్కార మతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యుల కేమి మేలు చేయును ? వారికేమి లాభము ? కాని పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు.

వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే యాత్మజ్ఞానము దానిమట్టుకది నాయందు ప్రకాశించెను; నేను కోరుట కేమియు లేకుండెను.

సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశమువలె బోధపడెను. తలక్రిందుగను కాళ్ళు మీదుగను నుంచుట వలన గలుగు ఆనందము గురువుకే తెలియును.

నలుగురిలో ఒకడు కర్మఠుడు (అనగా కర్మలందు నమ్మకము గలవాడు) అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియును.

రెండవవాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు.

మూడవవాడు భక్తుడు, భగవంతునికి సర్వస్య శరణాగతి చేసినవాడు, భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము.

వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు దెలిసిన విద్యపై నాధారపడి దేవుని వెదకుటకు పోయిరి.

వివేకమునకు వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలో నొకరు.

పరబ్రహ్మ స్వరూపులైకూడ వారెందుచేత నితరులతో కలిసి తెలివితక్కువగా ప్రవర్తించిరని యెవరైన నడుగవచ్చును.

ప్రజాభిప్రాయమును, వారి మంచిని సంపాదించుటకును, వారికొక యుదాహరణము జూపుటకును, వారిట్లు చేసిరి.

వారు అవతారపురుషులైనప్పటికి ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని యాహారము నామోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము.

బంజారా యాహారమును నిరాకరించినవారు కష్టముల పాలయిరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలుకాదని వారు బోధించిరి.

తైత్తిరీయోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మతగ్రంథముల నభ్యసించవలెనని చెప్పుచున్నది.

ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము.

ఇంద్రియములు గాని, మనస్సుగాని, బుద్ధిగాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును.

ధర్మము, అర్థము, కామము మన కృషివల్ల లభించును. కాని నాలుగవదియగు మోక్షము గురువు సహాయము వలననే పొందనగును.

సాయి దర్బారులోనికి అనేకమంది వచ్చి, వారికి తెలియు విద్యలను ప్రదర్శించి పోయెడివారు.

జ్యోతిష్కులు రాబోవు విషయములు చెప్పుచుండెడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై వచ్చెడివారు.

ఒక మహారు (మాలవాడు) వచ్చి జోహారు చేసి యీ సాయి ‘మాబాప్‌’ (తల్లియు తండ్రియు) అనియు, వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పెను.

గారడివాండ్రు, గుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాథసంప్రదాయము వారు, పగటి వేషములవారు కూడ అచ్చట సమాదరింపబడుచుండిరి.

తనవంతు రాగా ఆ బంజారా కూడ గాన్పించెను. తన పాత్రను ముగించెను. మనమిప్పుడింకొక కథను విందము.

గోఖలేగారి భార్య(తుల్సా వాసుదేవ్ గోఖలే) – ఉపవాసము :

బాబా యెన్నడు ఉపవసించలేదు. ఇతరులను కూడ ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయువాని మనస్సు స్థిమితముగా నుండదు.

అట్టివాడు పరమార్థ మెట్లు సాధించును ? ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలెను.

కడుపులో తడి కలుగుజేయు ఆహారము గాని, పౌష్ఠిక శక్తి గాని లేనప్పుడు భగవంతునే కండ్లతో చూడగలము ? ఏ నాలుకతో పొగడగలము. ఏ చెవులతో వానిని వినగలము ?

వేయేల మన యవయవములన్నియు వాని శక్తిని అవి సంపాదించు కొన్నప్పుడు, అవి మంచి స్థితిలో నున్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనముల నాచరించి దేవుని చేరగలము.

కాబట్టి ఉపవాసము గాని మితిమించిన భోజనము గాని మంచిది గాదు. ఆహారములో మితి శరీరమునకు మనస్సునకు కూడ మంచిది.

గోఖలే భార్య, కానిట్ కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదాకేల్కరుకు జాబు తీసికొని షిరిడీకి వచ్చెను.

ఆమె బాబా పాదముల వద్ద మూడు రోజులుపవసించి కూర్చొను నిశ్చయముతో వచ్చెను.

బాబా అంతకు ముందురోజు కేల్కరుతో తన భక్తులను హోళీ పండుగనాడు ఉపవాసనము చేయనీయనని చెప్పియుండెను. వారుపవసించినచో బాబా (తన) యొక్క ఉపయోగమేమనెను.

ఆ మరుసటి దినము ఆమె దాదాకేల్కరుతో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే యామెతో,  ”ఉపవాసము చేయవలసిన యవసరమేమి ? దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు బెట్టి నీవు కూడ తినుము” అనెను.

హోళీ పండుగ వచ్చెను. దాదాకేల్కరు భార్య బయట చేరెను. కేల్కర్‌ ఇంట్లో వండుట కెవరు లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితముగా నుండెను.

గోఖలే గారి భార్య దాదాభట్టు ఇంటికి బోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే యుండెను. ఇతరులకు బెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ ! ఎంత చక్కని నీతి !

బాబా సర్కారు :

బాబా తన బాల్యములో జరిగిన కథను ఈవిధముగ చెప్పెను. ”నా చిన్నతనములో భుక్తి కొరకు వెదకుచు బీడ్‌గాం వెళ్ళితిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లికపని దొరికెను.

శ్రమ యనక కష్టపడి పని చేసితిని. యజమాని నా పనికి సంతుష్టి చెందెను. నా కంటె పూర్వము ముగ్గురు కుఱ్ఱవాళ్ళు పనిలో నుండిరి.

మొదటివానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవవానికి 150 రూపాయలు, నాకీమూడు మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయల జీతమిచ్చెను.

నా తెలివితేటలు జూచి, యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని, నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను”. (తలపాగా, శెల్లా) వీనిని వాడకుండ జాగ్రత్తగా దాచుకొంటిని.

మానవుడిచ్చినది త్వరలో సమసి పోవునుగాని, దైవమిచ్చునది శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము.

నా ప్రభువు ”తీసుకో, తీసుకో” అనును కాని, ప్రతివాడు నావద్దకు వచ్చి ‘తే తే’ యనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడును లేడు.

నా సర్కారు యొక్క ఖజానా (ఆధ్యాత్మిక ధనము) నిండుగా నున్నది. అది యంచువరకు నిండి పొంగిపోవుచున్నది.

నేను ”త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకపొండు. సుపుత్రుడైనవాడు ఈ ద్రవ్యము నంతయు దాచుకొనవలెను” అనుచున్నాను.

”నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి యమోఘమైనవి.

నా సంగతి యేమి ? శరీరము మట్టిలో కలియును. ఊపిరి గాలిలో కలియును. ఇట్టి యవకాశము తిరిగి రాదు.

నేనెక్కడికో పోయెదను; ఎక్కడనో కూర్చుండెదను; మాయ నన్ను మిగుల బాధించుచున్నది. ఐనప్పటికి నావారి కొరకు నేను ఆతురపడెదను.

ఎవరయిన నేమైన సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరయితే నా పలుకులను జ్ఞప్తియందుంచుకొనెదరో, వారమూల్యమైన యానందమును పొందెదరు”.

ముప్పది రెండవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles