శ్రీ సాయి లీలామృతధార – సాయి పాదుకలు – పాద యాత్ర



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీ సాయి లీలామృతధార – సాయి పాదుకలు – పాద యాత్ర

ఈ రోజు మరొక అద్భుతమైన సాయి లీలామృతధార మనందరికోసం.  ఇది సాయిలీల మాసపత్రిక ఏప్రిల్ 1987వ సంవత్సరంలో ప్రచురింపబడింది.  ఆనాడు ఈ అనుభవాన్ని అనుభవించిన సాయి భక్తులు ఎంత అదృష్టవంతులో?

అది డిసెంబరు 25, 1985వ సంవత్సరం.  షిరిడీ నుండి తీసుకుని వచ్చిన శ్రీసాయినాథుల వారి పాదుకలను మేము మా భుజాలపై పల్లకిలో మోసుకుని తెస్తున్నాము. పాదుకల కోసమే ప్రత్యేకంగా తయారు చేయించిన పల్లకీలో ఉంచాము.

విజయవాడ రింగ్ రోడ్ మేరీ స్టెల్లా కాలేజీ వద్ద నున్న శ్రీసాయిబాబా గుడి వద్ద “ఓమ్ సాయి శ్రీ సాయి జయ జయ సాయి’ సాయి నామ జప కార్యనిర్వాహకుల వారు 26.12.1985 నుండి 13.02.1986 వరకు అఖండ సాయి నామసంకీర్తన తలపెట్టారు.

వారంతా కలిసి షిరిడీలో ఉన్న శ్రీ మార్తాండ మహరాజ్ గారి వద్ద నుండి పవిత్రమయిన శ్రీ సాయిబాబా వారి పాదుకలను తీసుకుని వచ్చారు. వారు తీసుకుని వచ్చిన ఈ పాదుకలను ఆంధ్రపదేశ్ లోని వివిధ ప్రదేశాలలో భక్తుల సందర్శనం కోసం తీసుకుని వెళ్ళి, ఆఖరికి మా మచిలీపట్నానికి తీసుకుని వచ్చారు.

మేమంతా ఈ పాదుకలని పల్లకీలో ఉంచి ఊరేగింపుగా మచిలీపట్నం నుండి విజయవాడకు పాదయాత్ర చేస్తూ తీసుకుని వెడదామని నిర్ణయించుకున్నాము. 25.12.1985 ఉదయం 8 గంటలకు ఉయ్యూరునుండి 40 నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు ‘ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి’ అని నామ జపం చేస్తూ పాదయాత్రను ప్రారంభించాము.

బాబా వారి పాదుకలను ఉంచిన చెక్క పల్లకీ చాలా బరువుగా ఉంది. సాయంత్రం లోపు మేము పాదుకలను అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ విజయవాడకు తీసుకుని వెళ్ళాలి. సాయి నామ జప నిర్వాహకులు విజయవాడలో 25వ తారీకు సాయంత్రం ఈ పాదుకల ఊరేగింపు ఏర్పాటు చేశారు. ఆలోగా మేము బాబా పాదుకలను విజయవాడకు చేర్చాలి.

పల్లకీని మా భుజాల మీద పెట్టుకుని, ఉయ్యూరు నుండి రెండు మూడు కిలోమీటర్లు నడిచేటప్పటికి మాకు చాలా అలసట వచ్చి, బాగా ఆకలి వేయసాగింది.

నామ జపం ఆపకుండా పల్లకీని భజాల మీద మోసుకుంటూ మొత్తం దూరాన్ని అధిగమిద్దామనే కృతనిశ్చయంతో ఉన్నాము. పాదయాత్ర ప్రారంభించే ముందు బాబాకి కొబ్బరికాయ కొట్టి బయలుదేరాము. ఆ కొబ్బరికాయ రెండు చెక్కలను మాలో ఒకతను తీసుకుని ఉంచాడు. అతను వాటిని చిన్న చిన్న ముక్కలుచేసి మాకందరికీ పంచాడు.

సరిగా అప్పుడే రోడ్డుకు ఎడమవైపున మాకొక సాధువు కనిపించాడు. అతని నుదుటి మీద నాలుగయిదు విభూతి రేఖలు ఉన్నాయి.  కనుబొమ్మల మధ్య కుంకుమ బొట్టు ఉంది.  అతను కాస్త పొట్టిగా ఉన్నాడు.

మాతో ఉన్న శ్రీపి.మాధవారావు గారు, జిల్లా పరిషత్ లో మానేజరు. ఆయన తన వాటా కొబ్బరి ముక్కలను ఆ సాధువుకు ఇమ్మని నాతో చెప్పాడు. నేనాయనకి కొబ్బరి ముక్కలను ఇస్తూ ఆయన వదనంలోకి చూశాను. ఆయన వదనం ఎంతో ప్రశాంతంగా మంచి కళతో దివ్యంగా ఉంది.

ఎలాగయినా సరే సాయంత్రానికల్లా విజయవాడకు చేరుకోవాలనే పట్టుదలతో దాదాపు పరుగెడుతున్నంతగా  పల్లకీని మోసుకుంటూ వెడుతున్నాము. ఆవేగంతో మేము అరగంటలో నాలుగయిదు కిలోమీటర్లు  పూర్తి చేయగలిగాము.

మాలో ప్రతి ఒక్కరూ ఎంతో భక్తితో గట్టిగా సాయి నామాన్ని ఉచ్ఛరిస్తూనే ఉన్నారు.  ఆశ్చర్యం ఏమిటంటే రోడ్డుకు ఎడమ వైపున ఇంతకుముందు కనిపించిన సాధువే అక్కడ నిలబడి మావైపు చూస్తూ ఉన్నాడు.

మాకందరికీ ఒళ్ళు జలదరించి ఒక విధమయిన ఉద్వేగం కలిగింది. ఇంతకుముందు మేము చూసిన సాదువే ఇంత దూరం మమ్మల్ని దాటుకుని వచ్చి, మాకన్నా ముందు వచ్చి మా ఎదురుగా నిలుచున్నాడు. అంత వేగంగా అతను ఎలా రాగలిగాడు?  మేము ఇక్కడికి చేరుకునేలోగా మమ్మల్ని దాటుకుని ఏ బస్సు గాని, మరే విధమయిన వాహనం గాని రాలేదు.  మరి మాకన్నా ముందురావడం అతనికెలా సాధ్యమయింది?

మాకందరికి హృదయాంతరాళాలలో అనిపించిందేమిటంటే  అతను సాధారణమయిన సాధువు కాదు.  ఆయనే సాయిబాబా అని ఇంకా రెట్టించిన ఉత్సాహంతోను, ఆనందంతోను మా పెదవులపై సాయి నామం జపిస్తూ ముందుకు సాగుతున్నాము.

ఆఖరికి విజయవాడ శ్రీసాయిబాబా మందిరానికి చేరుకున్నాము. మందిరంలో ఉన్న సాయి విగ్రహాన్ని చూశాము.  విగ్రహం పొట్టిగా ఉంది.  నుదుటి మీద నాలుగు గీతలు, కనుబొమల మధ్య కుంకుమ బొట్టు.  ఆ విగ్రహాన్నిమొట్టమొదటగా నేనే చూశాను.  నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇదే ఆకారంతో సాధువుగా దర్శనమిచ్చి బాబా మాకు స్వాగతం పలికారు.

కొద్ది నిమిషాలలోనే కమిటీ వారు వచ్చి ఒక పెద్దావిడ తీసుకుని వచ్చిన బిస్కెట్లు తిని టీ త్రాగమని చెప్పారు.  ఆవిడ ఒక ఆశ్చర్యకరమయిన విషయం చెప్పారు. ఆరోజు మధ్యాహ్నం ఆవిడ నిద్రపోతుండగా మూడు గంటల సమయంలో బాబా ఆమెకు స్వప్నంలో కనిపించి, తన భక్తులు పూర్తిగా అలసిపోయి ఆకలితో వస్తున్నారని, వారి కోసం ఏమయినా తీసుకుని వెళ్లమని చెప్పారట.

తనకు ఆ భక్తులెవరో ఎక్కడి నుండి వస్తున్నారో కూడా తెలియదని చెప్పింది ఆవిడ.  తనకు  ఈ పాదుకల గురించి, పాదయాత్ర గురించి కూడా తెలియదని చెప్పారు.

ఇంటిలో టీ తయారుచేసి, బయట బిస్కట్లు కొని సిటీ బస్సులో బాబా గుడికి వచ్చానని చెప్పారు. బస్సులో నుండి, మమ్మల్నందరిని పల్లకీ మోసుకుంటూ బాబా గుడి వైపు రావడం చూశానని చెప్పారావిడ. 

అప్పుడామె బాబా తనకు స్వప్నంలో ఎవరి గురించి చెప్పారో వారే మీరు అని అర్ధం చేసుకున్నానని అన్నారు. ఇదంతా వివరించి  ఆవిడ మాకందరికీ బిస్కెట్లు ఇచ్చి కప్పులతో టీ ఇచ్చింది.

సాయి పాఠకులారా! మీ భారమంతటినీ సాయి మీదే మోపండి.  మొదటి నుండి చివరి వరకు ఆయన మీవెంటే ఉంటారు. ఆయన సన్నిధికి చేరుకోగానే ఆయన మాకోసం టీ, బిస్కెట్లు తయారుగా ఉంచారు.

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి.

ఎ. సాంబశివరావు,

మచిలీపట్నం

కృష్ణా జిల్లా

చూసారా సాయిబంధువులారా! ఎంత అద్భుతమయిన అనుభవం!  దారిలో కనిపించిన సాధువు బాబా గారే అనే ఉద్దేశ్యంతో ఉన్న వారికి, మందిరంలో విగ్రహాన్ని చూసిన తరువాత బాబాయే స్వయంగా వచ్చారని అర్ధమవగానే వారి మనోభావాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.  ఆనాడు వారు ఎంతటి పుణ్యం చేసుకున్నారో కదా. ఆ అనుభూతి వర్ణించడానికి మాటలు చాలవు. పైగా తన భక్తులు ఆకలితో వస్తున్నారని వారికోసం బిస్కెట్లు, టీ తయారు చేయించి ఉంచారు. బాబాకు తన భక్తులపై ఎంతటి ప్రేమో కదా! ఆయన తన భక్తులు తన సేవలో కష్ట పడుతుంటే సహాయం చేయడానికి వెంటనే వస్తారని ఈ అనుభవం వల్ల మనం గ్రహించుకోవచ్చు.

ఓమ్ సాయిరామ్

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles