🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹మూడవ అధ్యాయం🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice By: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

మూడవ అధ్యాయం

సాయిబాబా యనుమతి – వాగ్దానము; భక్తులకు వేర్వేరు పనులు నియమించుట;

బాబా కథలు దీపస్తంభములు; సాయిబాబా మాతృ ప్రేమ – రోహిల్లా కథ;

బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు

సాయిబాబా యొక్క యనుమతి, వాగ్దానము :

       వెనుకటి యధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి యనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి :

”సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి గలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము. భయపడకుము. మనస్సు నిలకడగా నుంచుము. నా మాటల యందు విశ్వాసముంచుము.

నా లీలలు వ్రాసినచో నవిద్య అంతరించి పోవును. శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును. ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును”.

ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలిగెను.

అటుపైని మాధవరావు దేశపాండే (శ్యామా) వైపు తిరిగి బాబా యిట్లనెను :

”ప్రేమతో నా నామమునుచ్ఛరించిన వారి కోరికలన్నియు నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారినన్ని దిశలందు కాపాడెదను.

ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా నాధారపడియున్నారో వారీ కథలు వినునప్పుడు అమితా నందమును పొందెదరు. నా లీలలను గానము చేయువారికంతులేని యానందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము.

ఎవరయితే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో, వారిని దుఃఖ బంధనముల నుండి తప్పింతును.

ప్రాపంచిక విషయములనన్నింటినీ మరచి, నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను, చరిత్రమును మననము చేయుచు, ఎల్లప్పడు నన్ను జ్ఞప్తియందుంచుకొనువారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు? వారిని మరణము నుండి బయటకు లాగెదను.

నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిదియే మార్గము.

నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును.

‘సాయి సాయి’ యను నామమును జ్ఞప్తి యందుంచుకొన్నంత మాత్రమున, చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును”.

భక్తులకు వేర్వేరు పనులు నియమించుట :

భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును.

కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు.

భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది.

విషయ జ్ఞానము శూన్యమగుటచే నీ పని నా అర్హతకు మించినది. అయినచో, యింత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను ?

సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు ? సాయి యొక్క కరుణయే యింత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది.

నేను చేత కలము పట్టుకొనగనే సాయిబాబా నా యహంకారమును పరిహరించి, వారి కథలను వారే వ్రాసికొనిరి కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందునుగాని నాకు గాదు.

బ్రాహ్మణుడనై పుట్టినప్పటికిని శ్రుతి స్మృతి యను రెండు కండ్లు లేకుండుటచే సాయి సచ్ఛరిత్రను నేను వ్రాయలేకుంటిని.

కాని భగవంతుని అనుగ్రహము మూగవానిని మాట్లాడునట్లు చేయును; కుంటివానిని పర్వతము దాటునట్లు చేయును. తన యిచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొను చాతుర్యము ఆ భగవంతునికే గలదు.

హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియును.

చంద్రకాంతము ద్రవించుట, సముద్రముప్పొంగుట వాని వాని వల్ల జరుగవు. అవి చంద్రోదయము వల్ల జరుగును.

బాబా కథలు దీపస్తంభములు :

సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును. పడవల పై పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణింతురు.

ప్రపంచమను మహాసముద్రములో బాబా కథలను దీపములు దారి చూపును. అవి అమృతము కంటె తియ్యగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగను, సుగమముగను చేయును.

యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించునప్పుడు శరీర స్పృహయును, అహంకారమును, ద్వంద్వ స్వభావములును నిష్క్రమించును.

మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలయిపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వచేయబడును.

శ్రీ సాయిబాబా కీర్తి, వర్ణనలు ప్రేమతో పాడినగాని, వినినగాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి యివియే మోక్షమునకు సులభ సాధనములు.

కృత యుగములో శమదమములు (అనగా నిశ్చల మనస్సు, శరీరము), త్రేతాయుగములో యాగము, ద్వాపర యుగములో పూజ, కలియుగములో భగవన్మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు.

నాలుగు వర్ణములవారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము.

కాని భగవంతుని కీర్తిని, మహిమను పాడుట యతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను.

భగవత్కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగ జేసి, తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందునట్లు చేయును.

ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను.

భక్తులు దానిని సులభముగ చదువగలరు, వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసికొనవచ్చును.

ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది యాత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుదుము.

సచ్చరితామృతము వ్రాయుట, తయారుచేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్తమాత్రుడుగనే యుంటిని.

సాయిబాబా యొక్క మాతృప్రేమ :

ఆవు తన దూడనెట్లు ప్రేమించునో యందరికి తెలిసిన విషయమే. దాని పొదుగెల్లప్పుడు నిండియే యుండును.

దూడకు కావలసినప్పుడెల్ల కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును.

బిడ్డకు గుడ్డలు తొడుగుట యందును, అలంకరించుట యందును తల్లి తగిన శ్రద్ధ తీసికొని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయ మేమియు తెలియదు గాని, తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి యలంకరింపబడుట చూచి యమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చ దగిన దేదియు లేదు. అది యసామాన్యము; నిర్వ్యాజము.

సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు గూడ నా యందట్టి ప్రేమ యుండెను. దానికీ క్రింది యుదాహరణ యొకటి.

1916వ సంవత్సరములో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించితిని. నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు.

గురుపౌర్ణమినాడు ఇతర భక్తులతో నేను కూడ షిరిడీకి పోయితిని. అణ్ణా చించణీకర్‌ నాగురించి బాబాతో నిట్లనెను :

”దయచేసి యీ అన్నాసాహెబ్‌ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు, వాని కుటుంబము పెరుగుచున్నది. వాని కింకేదైన ఉద్యోగ మిప్పించుము. వాని యాతురతను తీసి, నిశ్చింతను గలుగ చేయుము”

అందులకు బాబా యిట్లు జవాబిచ్చెను : ”వాని కింకొక ఉద్యోగము దొరుకును. కాని వాడిప్పుడు నా సేవతో తృప్తిపడవలెను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగనే యుండును. అవి ఎన్నటికిని నిండుకొనవు.

వాని దృష్టినంతటిని నావైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను. అందరి యెడల అణుకువ నమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగ పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును”.

నన్ను పూజింపుడను దానిలోని ఈ ‘నన్ను’ అనగా ఎవరు ? అను ప్రశ్నకు సమాధానము యీ  గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో ‘సాయిబాబా ఎవరు’ అను శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి యున్నది. చూడుడు !

రోహిల్లా కథ :

రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ యెట్టిదో బోధపడును. పొడుగాటి వాడును, పొడుగైన చొక్కా తొడిగినవాడును, బలవంతుడునగు రోహిల్లా యొకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిరనివాసము ఏర్పరచుకొనెను.

రాత్రింబవళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు, ”అల్లాహు అక్బర్‌” యని యాబోతు రంకె వేయునట్లు బిగ్గరగా నరచుచుండెను.

అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి యింటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను.కొన్నాళ్ళవరకు వారు దీని నోర్చుకొనిరి.

తుదకు ఆ బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిలా అరపుల నాపుమని బతిమాలిరి.

బాబా వారి ఫిర్యాదును వినకపోవుటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిల్లా జోలికి పోవద్దని మందలించిరి.

‘రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు, ఆమె గయ్యాళి యనియు, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టుచున్నదనియు, రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమి చేయలేక ఊరకయుండు”ననియు బాబా చెప్పెను.

నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు. భార్య యనగా దుర్భుద్ధియని బాబా భావము.

బాబాకు అన్నిటికంటె దైవ ప్రార్థనలందు మిక్కుటమగు ప్రేమ, అందుచే రోహిల్లా తరపున వాదించి, ఊరిలోని వారి నోపికతో నోర్చుకొని ఆ అసౌకర్యమును సహింపవలసిన దనియు, నది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను.

బాబా యొక్క యమృత తుల్యమగు పలుకులు :

ఒకనాడు మధ్యాహ్న హారతి యయిన పిమ్మట భక్తులందరు తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా యీ క్రింది చక్కని యుపదేశ మిచ్చిరి :

”మీరెక్కడ నున్ననూ, ఏమి చేయుచున్ననూ నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు.

నేనందరి హృదయముల పాలించువాడను. అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటి నావరించియున్నాను.

ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టి స్థితి లయ కారకుడను నేనే.

ఎవరయితే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారికేహాని గాని బాధ గాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి యంతయు నాశరీరమే, నా రూపమే !”.

ఈ చక్కని యమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో యే నౌకరీ కొరకు యత్నించక, గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకొంటిని.

కాని, అణ్ణా చించణీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సు నందుండెను. అది జరుగునా లేదా యని సందేహము కలుగుచుండెను.

భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగము దొరకెను. కాని అది కొద్దికాలము వరకే. అటు పిమ్మట వేరే పని యేదియు చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించితిని.

ఈ యధ్యాయమును ముగించబోవుముందు చదువరులకు నేను చెప్పున దేమన, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు దేహాభిమానము మొదలగు వానిని విడిచి, వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథలవైపు త్రిప్పవలెను.

వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలిసికొందురుగాక. ఇతర మార్గము లవలంబించి అనవసరముగా నలసిపోవద్దు. అందరు నొకే మార్గమును త్రొక్కుదురు గాక ! అనగా శ్రీ సాయి కథలను విందురు గాక !

ఇది వారి యజ్ఞానమును నశింపజేయును. మోక్షమును సంపాదించి పెట్టును. లోభి యెక్కడ నున్నప్పటికిని వాని మనస్సు తాను పాతి పెట్టిన సొత్తునందే యుండునట్లు, బాబాను కూడ నెల్లరు తమ హృదయములందు స్థాపించుకొందురుగాక !

మూడవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles