🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹అయిదవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice By: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

అయిదవ అధ్యాయము

పెండ్లి వారితో కలసి బాబా తిరిగి షిరిడీ వచ్చుట; ఫకీరుకు ‘సాయి’ నామమెట్లు

వచ్చెను; ఇతర యోగులతో సహవాసము; బాబా దుస్తులు-వారి నిత్య కృత్యములు;

వేపచెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము; ఈ కథ యొక్క పూర్తి వివరములు;

మొహియొద్దీన్‌ తంబోలితో కుస్తీ – జీవితములో మార్పు; నీళ్లను నూనెగా మార్చుట;

జౌహర్ అలీ యను కపట గురువు

పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట :

ఔరంగాబాద్‌ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయు డొకడుండెను. అతనిపేరు చాంద్ పాటీలు.

ఔరంగాబాదు పోవుచుండగా అతని గుఱ్ఱము తప్పిపోయెను. రెండు మాసములు వెదకినను దాని యంతు దొరకకుండెను.

అతడు నిరాశచెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి ధూప్‌ గ్రామమునకు పోవుచుండెను.

సుమారొక తొమ్మిది మైళ్ళు నడచిన పిమ్మట నొక మామిడిచెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో నొక వింత పురుషుడు కూర్చొనియుండెను.

అతడు తలపై టోపి, పొడుగైన చొక్కా ధరించియుండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను.

దారివెంట పోవు చాంద్ పాటీలును జూచి, అతనిని బిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి గొనుమనెను.

జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుఱ్ఱముదని చాంద్‌ పాటీలు బదులు చెప్పెను. ఆ దగ్గరలో నున్న కాలువ ప్రక్కన వెదకుమని ఫకీరు చెప్పెను.

అతడచటకు పోయి గడ్డి మేయుచున్న గుఱ్ఱమును చూచి మిక్కిలి యాశ్చర్యపడెను.

ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియు గొప్ప ఔలియా (సిద్ధపురుషుడు) అయి యుండవచ్చు ననియు అనుకొనెను.

గుఱ్ఱమును దీసికొని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కాని చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి యుండెను.

ఫకీరు సటకాను భూమిలోనికి గ్రుచ్ఛగా నిప్పు వచ్చెను. మరల అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను.

ఫకీరు చ్చాపీ (గుడ్డ ముక్క) నా నీటితో తడిపి, నిప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి, తరువాత చాంద్‌ పాటీలు కందించెను.

ఇదంతయు జూచి చాంద్‌ పాటీలు ఆశ్చర్య చకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్‌ పాటీలు వేడెను.

ఆ మరుసటిదినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి యచ్చట కొంతకాలముండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు.

అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడీ గ్రామము.

అందుచే కావలసిన సన్నాహములన్నియు చేసికొని పాటీలు షిరిడీ ప్రయాణ మయ్యెను. పెండ్లివారితో కలసి ఫకీరు కూడా బయలుదేరెను.

ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు ధూప్‌ గ్రామము తిరిగి వెళ్ళిరి గాని ఫకీరు మాత్రము షిరిడీలో ఆగి, యచ్చటనే స్థిరముగా నిలిచెను.

ఫకీరుకు ‘సాయి’ నామమెట్లు వచ్చెను ?

పెండ్లివారు షిరిడీ చేరగనే ఖండోబా మందిరమునకు సమీపమున నున్న భక్త మహల్సాపతి గారి పొలములో నున్న మఱ్ఱిచెట్టు క్రింద బసచేసిరి.

ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో నున్నవారొకరి తరువాత నొకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను.

బండి దిగుచున్న యువ ఫకీరును జూచి భక్త మహల్సాపతి ”రండి సాయీ” ! యని స్వాగతిచెను. తక్కినవారు గూడ ఆయనను ‘సాయి’ యని పిలువ నారంభించిరి. అది మొదలు వారు ‘సాయిబాబా’గా ప్రఖ్యాతులైరి

ఇతర యోగులతో సహవాసము :

సాయిబాబా షిరిడీలో నొక మసీదులో నివాస మేర్పరచుకొనిరి. బాబా షిరిడీ రాక పూర్వమే దేవీదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను.

బాబా అతనితో సాంగత్యమున కిష్టపడెను. అతనితో కలసి కొంతకాలము మారుతీ మందిరములోను, చావడిలోను నుండెను. కొంతకాల మొంటరిగా నుండెను.

అంతలో జానకీదాసు గోసావి అను నింకొక యోగి యచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు లేదా, బాబా ఉండుచోటుకు జానకీదాసు పోవుచుండెను.

అటులనే, పుణతాంబే నుండి యొక వైశ్య యోగి షిరిడీ వచ్చుచుండెడివాడు. ఆయన గృహస్థుడు; పేరు గంగాగీరు.

ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్ళు తెచ్చి పూలచెట్లకు పోయుచుండుట జూచి అతడు షిరిడీ గ్రామస్థులతో నిట్లనెను.

”ఈ మణి యిచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమయినది. ఈయనీనాడు కుండలతో నీళ్ళు మోయుచున్నాడు. కాని యితడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగ పుణ్యము చేసికొనినది కనుకనే సాయిబాబా యను నీ మణిని రాబట్టుకొన గలిగెను”.

ఏవలా గ్రామములో నున్న మఠములో ఆనందనాథుడను యోగిపుంగవు డుండెను. అతడు అక్కల్‌కోటకర్‌ మహరాజ్‌ గారి శిష్యుడు.

అతడొకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను జూచి యిట్లనెను.

”ఈయన యొక యమూల్యమైన రత్నము. సామాన్య మానవుని వలె గాన్పించునప్పటికిని ఈయన మామూలు రాయివంటి వాడు కాదు. ఈయనొక యమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు”.

ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యోవ్వనమున జరిగిన సంగతి.

బాబా దుస్తులు – వారి నిత్యకృత్యములు :

యోవనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వానువలె దుస్తులు వేసుకొనెడివారు.

షిరిడీకి మూడుమైళ్ళ దూరములో నున్న రహతాకు పోయినప్పుడొకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసికొనివచ్చి, నేలను చదునుచేసి వాటిని నాటి నీళ్ళు పోయుచుండిరి.

అనుదినము వామన్‌తాత్యా యను కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చి కుండలను ఇచ్చుచుండెడివాడు.

బాబా స్వయముగ బావి నుండి నీళ్ళు చేది, ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి, భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసెడివారు.

సాయంకాలము ఆ కుండలను వేపచెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చనివగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలగుచుండెడివి.

ఇట్లు మూడు సంవత్సరములు గడచెను. సాయిబాబా కృషి వలన అచ్చట నొక పూలతోట లేచెను.

ఆ స్థలములోనే యిప్పుడు బాబా సమాధి యున్నది. దానినే సమాధి మందిర మందురు. దానిని దర్శించుట కొరకే యనేకమంది భక్తులు విశేషముగా పోవుచున్నారు.

వేపచెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము :

అక్కల్‌కోటకర్‌ మహరాజ్‌ గారి భక్తుడు భాయికృష్ణజీ అలీబాగ్‌కర్‌. ఇతడు అక్కల్‌కోటకర్‌ మహరాజ్‌ గారి చిత్ర పటమును పూజించెడివాడు.

అతడొకప్పుడు షోలాపూరు జిల్లాలోని అక్కల్‌కోట గ్రామమునకు పోయి, మహరాజ్‌ గారి పాదుకలు దర్శించి పూజించవలెనని యనుకొనెను.

అతడచ్చటికి పోక మునుపే స్వప్నములో ఆ మహరాజ్‌ దర్శనమిచ్చి యిట్లు చెప్పెను.

”ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజ యొనరింపుము !” అందుచే, అక్కల్‌కోట పోవలెనను తన నిర్ణయమును మార్చుకొని భాయికృష్ణజీ షిరిడీ చేరి, బాబాను పూజించి, అచ్చటనే ఆరు మాసములు ఆనందముతో గడిపెను.

దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములో నొక శుభదినమున వేపచెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సం. 1834, శ్రావణ మాసములో (అనగా, క్రీ.శ. 1912లో) జరిగెను.

దాదాకేల్కర్‌, ఉపాసనీబాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షిత్‌ యను బ్రాహ్మణుడు పాదుకల నిత్యపూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమేరు నాయక్‌న కప్పగించబడినది.

ఈ కథ యొక్క పూర్తి వివరములు :

ఠాణే వాస్తవ్యుడైన శ్రీ బి.వి. దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేసిరి.

వేపచెట్టు క్రింద ప్రతిష్ఠింప బడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నియు సగుణ్‌మేరు నాయక్‌ మరియు గోవింద కమలాకర్‌ దీక్షిత్‌ల నుండి సేకరించి,

పాదుకల పూర్తి వృత్తాంతము, శ్రీ సాయిలీల మాసపత్రిక రెండవ సంపుటము, మొదటి సంచిక, 25వ పేజీలో నీరీతిగా ప్రచురించినారు.

1912వ సంవత్సరములో బొంబాయి నుండి డాక్టరు రామారావు కొఠారెయను నతడు షిరిడీ వచ్చెను.

వానితో బాటుగ అతని కాంపౌండర్ ను మరియు అతని మిత్రుడైన భాయికృష్ణజీ అలీబాగ్‌కర్‌ అనునతడును వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగుణ్‌మేరు నాయక్‌కు జి.కె. దీక్షిత్‌కు సన్నిహితులైరి.

అనేక విషయములు తమలో తాము చర్చించుకొనునప్పుడు సంభాషణ వశాత్తూ, బాబా ప్రప్రథమమున షిరిడీ ప్రవేశించి వేపచెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి.

ఈ సంగతి డాక్టరు రామారావు కొఠారేకు దెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని భాయికృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చెను.

అందరును యీ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టరు గారికి ఈ విషయమును తెలియపరచిరి.

వారు వెంటనే మరల షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసినీ మహరాజ్‌ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను జూపిరి.

శ్రీ ఉపాసనీ దానిలో కొన్ని మార్పులను జేసి, పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి, బాబా యోగశక్తిని వేపచెట్టు గొప్పతనమును దెలుపు యీ క్రింది శ్లోకమును కూడ చెక్కించమనిరి :

సదా నింబవృక్షస్య మూలాధివాసాత్‌

సుధా స్రావిణం తిక్తమప్యప్రియం తమ్‌

తరుం కల్పవృక్షాధికం సాధయంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్‌

ఉపాసనీ సలహాల నామోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయుమని బాబా యాజ్ఞాపించెను.

ఆనాడు 11 గంటలకు జి.కె. దీక్షిత్‌ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి.

బాబా యా పాదుకలను స్పృశించి, అవి భగవంతుని పాదుకలని నుడివెను. వానిని వేపచెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని యాదేశించెను.

ఆ ముందురోజు బొంబాయినుండి పాస్తాసేట్ యను పార్సీ భక్తుడొకడు మనియార్డరు ద్వారా 25 రూపాయలు పంపియుండెను.

బాబా యా పైకము పాదుకా ప్రతిష్ఠ కగు ఖర్చు నిమిత్తమిచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి.

మొదటి 5 సంవత్సరములు జి.కె. దీక్షిత్‌ ఈ పాదుకలకు పూజ చేసెను. తరువాత లక్ష్మణ్‌ కచేశ్వర్‌ జాఖ్ డె యను బ్రాహ్మణుడు (నానునామా పూజారి) పూజ చేయుచుండెను.

మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టరు కొఠారె దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టు కంచె కూడా పంపెను.

ఈ కంచెయు, పై కప్పును కోపర్‌గాం స్టేషన్‌ నుండి షిరిడీ తెచ్చుటకు 7-8-0 ఖర్చు సగుణ్‌మేరు నాయక్‌ ఇచ్చెను. (ప్రస్తుతము జాఖ్ డె పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు).

మొట్టమొదట భాయికృష్ణజీ, అక్కల్‌కోటకర్‌ మహరాజ్‌ భక్తుడు. 1912వ సంవత్సరములో వేపచెట్టు క్రింద పాదుకలు స్థాపించునప్పుడు అక్కల్‌ కోటకు పోవుచు మార్గమధ్యమున షిరిడీ యందు దిగెను.

బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్‌కోట గ్రామమునకు పోవలెననుకొని బాబా వద్దకేగి యనుమతి నిమ్మనెను.

బాబా యిట్లనెను. ”అక్కల్‌కోటలో నేమున్నది ? అక్కడేల పోయెదవు ? అక్కడుండే మహరాజ్‌ ప్రస్తుతమిక్కడనే యున్నారు. వారే నేను”. ఇది విని భాయికృష్ణజీ అక్కల్‌కోట వెళ్ళుట మానుకొనెను.

పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేసెను.

హేమాడ్‌పంతునకీ వివరములు తెలిసియుండవు. తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు.

మొహియొద్దీన్‌ తంబోలితో కుస్తీ – జీవితములో మార్పు :

షిరిడీ గ్రామములో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్‌ తాంబోలి యనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు.

వానికి, బాబాకు ఒక విషయములో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా యోడిపోయెను.

అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను, నివసించు రీతిని మార్చుకొనెను.

లంగోటి బిగించుకొని, (ఫకీరులు ధరించు) పొడవాటి చొక్కా (కఫ్నీ)ని తొడిగికొని, నెత్తిపైని గుడ్డ కట్టుకొనేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునెడివారు. చింకిగుడ్డలతో సంతుష్టి చెందెడివారు.

రాజ్య భోగము కంటె దారిద్య్రమే మేలని నుడివెడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు.

గంగాగీరుకు కూడ కుస్తీలయందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా యతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయములో ‘దేహమును దమించి, దేవుని సహవాసము చేయమ’ని యొక యశరీరవాణి యతనికి వినిపించెను.

అప్పటి  నుండి గంగాగీరు సంసారము విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నదియొడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను.

సాయిబాబా జనులతో కలసి మెలసి తిరిగెడివారు కారు; ఎవ్వరితోను తమంతట తాము మాట్లాడెడివారు కారు. ఎవరైన యేదైన అడిగిన యాయడిగినదానికి మాత్రము జవాబిచ్చువారు.

దినములో యెక్కువ భాగము వేపచెట్టు నీడయందు, అప్పుడప్పుడు యూరవతలనున్న కాలువ యొడ్డున గల తుమ్మచెట్టు నీడన కూర్చొనెడివారు.

సాయంకాల మూరకనే కొంతదూరము నడిచెడివారు; ఒక్కొక్కసారి నీమ్‌గాం పోవుచుండెడివారు. నీమ్‌గాంలో బాబాసాహెబ్‌ త్య్రంబక్‌జీ డేంగలే యనునతని ఇంటికి తరుచుగా పోవువారు.

బాబాసాహెబ్‌ డేంగలే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతడు రెండు వివాహములు చేసికొన్నను సంతానము కలుగలేదు.

బాబాసాహేబు డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా యనుగ్రహముచే నానాసాహెబుకు పుత్ర సంతానము కలిగెను.

అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోప తండములుగా రాసాగిరి. వారి కీర్తి యంతటను వెల్లడి యాయెను. అహమద్‌నగరు వరకు వ్యాపించెను.

అక్కడి నుండి నానాసాహెబు చాందోర్కరు, కేశవ్‌ చిదంబర్‌ మొదలుగా గల యనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి.

దినమంతయు బాబాను భక్తులు చుట్టియుండెడివారు. రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదు నందు శయనించుచుండెను.

పొగ పీల్చుకొను ‘చిలిం’ గొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్నీ, తలగుడ్డ ఎల్లప్పుడు దగ్గరనుంచుకొను ‘సటకా’ (చేతికర్ర) మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు.

తలపై నొక గుడ్డను చుట్టి, దాని అంచులను జడవలె మెలి బెట్టి ముడివేసి, యెడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసుకొనువారు.

తమ దుస్తులను వారముల తరబడి ఉతుకకుండ నుంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చొనేవారు. (కఫ్నీ క్రింద) లంగోటీ కట్టుకొనెడివారు.

చలిని కాచుకొనుటకు ధుని కెదురుగా (మసీదు ఈశాన్య భాగములో గల) కొయ్య చేపట్టుపై తమ యెడమ చేతినానించి, దక్షిణాభిముఖముగా కూర్చునేవారు.

ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి ‘అల్లాయే యజమాని’ అని పలికేవారు.

మసీదులో రెండు గదుల స్థలము మాత్రముండెను. భక్తులందరు అచటనే బాబాను దర్శించుచుండిరి.

1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేసి నేలపైన నగిషీరాళ్ళు తాపనచేసిరి.

బాబా యీ మసీదుకు రాకపూర్వము ‘తకియా’ (రచ్చ)లో చాలా కాలము నివసించిరి.

బాబా తమ కాళ్ళకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు; భక్తి పూర్వకమయిన పాటలు పాడేవారు.

నీళ్లను నూనెగా మార్చుట :

సాయిబాబాకు దీపములన్న చాలా యిష్టము. ఊరిలో నూనెను విక్రయించు షాహుకార్లను నూనె యడిగి తెచ్చి మసీదునందు రాత్రియంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను.

ఒకనాడు నూనె ఇచ్చు దుకాణాదారులందరు కూడబలుకుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి.

బాబా వారి దుకాణములకు ఎప్పటివలె పోగా నూనె లేదనిరి. బాబా కలత జెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి యుంచెను.

నూనె వ్యాపారులు ఆసక్తితో నిదంతయు గమనించుచుండిరి. అడుగున రెండు మూడు నూనెచుక్కలు మిగిలియున్న తమ రేకుడబ్బాలో నీటిని పోసి కలియ బెట్టి, ఆ నీటిని త్రాగివేసిరి.

ఈ విధముగా యా రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట, మరల డబ్బాతో నీరు తీసికొని, యా నీటిని ప్రమిదలలో నింపెను.

దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణాదారులు విస్మయమొందునట్లు ప్రమిదలన్నియు తెల్లవారుదాక చక్కగా వెలుగుచుండెను.

ఇదంతయు జూచి యా షాహుకార్లు పశ్చాత్తాపపడి, బాబాను మన్నింపుమని కోరిరి. బాబా వారిని క్షమించి, ఇకపైనైననూ సత్యము నంటిపెట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసిరి.

జౌహర్ అలీ యను కపటగురువు :

పైన వివరించిన కుస్తీ జరిగిన యయిదేండ్ల తరువాత అహమదునగరు నుండి జౌహర్ అలీ యను ఫకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను.

వీరభద్ర మందిరమునకు సమీపములో నున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకొన్నవాడు,

ఖురానంతయు వల్లించగలడు, మధురభాషణుడు. ఆ యూరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవము తో చూచుచుండెడివారు.

వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ‘ఈద్‌గా’ యను గోడను నిర్మించుటకు పూనుకొనెను.

ఈదుల్‌ ఫితర్‌ అను పండుగనాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ‘ఈద్‌గా’.

ఈ విషయములో వివాదము లేచి, అది ఘర్షణలకు దారితీసెను. దానితో జౌహర్ అలీ రహతా విడిచి, షిరిడీ చేరి బాబాతో మసీదునందుండ సాగెను.

ప్రజలు వాని తీపిమాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా యందుల కడ్డు చెప్పక శిష్యునివలెనే మసలు కొనెను.

తరువాత గురుశిష్యులిద్దరూ రహతాకు పోయి యచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి.

గురువునకు శిష్యుని శక్తి యేమియు తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియును.

అయినప్పటికీ బాబా ఆ కపట గురువునెప్పుడు అగౌరవించక, శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు.

అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండెడివారు కాని అధికముగా రహతాలోనే నివసించేవారు.

షిరిడీలోని సాయిభక్తులకు బాబా ఆ విధముగ రహతాలో నుండుట ఎంత మాత్ర మిష్టము లేకుండెను. అందుచే వారందరు కలసి సాయిబాబాను మరల షిరిడీకి పిలుచుకొనివచ్చుటకు రహతా వెళ్ళిరి.

వారు రహతాలో ఈద్‌గా వద్ద బాబాను ఒంటరిగా చూచి, వారిని తిరిగి షిరిడీ తీసికొని పోవుటకై వచ్చినామని చెప్పిరి.

జౌహర్ అలీ ముక్కోపి యనీ, ఆయన తనను విడిచిపెట్టడనీ, అందువలన వారు తనయందు ఆశ విడిచి, ఫకీరు అక్కడకు వచ్చులోపల, షిరిడీ మరలివెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను.

వారిట్లు మాట్లాడుకొనుచుండగా, జౌహర్ అలీ అక్కడకు వచ్చి, బాబాను తీసికొని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను.

కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురుశిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది.

వారు షిరిడీ చేరి యచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి యతని బండారము బయటపెట్టెను.

చాంద్‌ పాటీలు పెళ్ళి బృందముతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే పది పన్నెండేళ్ళ వయసులో దేవీదాసు షిరిడీ చేరెను.

వారు మారుతి దేవాలయములో నుండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతములైన నేత్రములు కలిగి, నిర్వ్యామోహితావతారము వలె జ్ఞానివలె కనపడుచుండెను.

తాత్యా పాటీలు, కాశీనాథ్‌ షింపీ మొదలుగా గల యనేకమంది దేవీదాసును తమ గురువుగా భావించెడివారు.

వారు జౌహర్ అలీని దేవిదాసు వద్దకు తీసికొనివచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జౌహర్ అలీ చిత్తుగా యోడిపోయి, షిరిడీ నుండి పలాయనము చిత్తగించెను.

ఆ తరువాత యతడు వైజాపూరులో నుండి, చాలా యేండ్ల తరువాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై బడెను.

తాను గురువు, సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సు నుండి తొలగి, తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవముగానే చూచెను.

ఈవిధముగా శిష్యుడు గురువునెట్లు సేవింపవలెనో, యెట్లు అహంకార మమకారములను విడిచి గురుశుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగ నిరూపించెను.

ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల యాధారముగ వ్రాయబడినది.

అయిదవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles