🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది యొకటవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

ఇరువది యొకటవ అధ్యాయము

పస్తావన; యోగీశ్వరుల వ్యవస్థ; వి.హెచ్‌. ఠాకూర్‌; అనంతరావు పాటంకర్‌;

నవవిధ భక్తి; పండరీపురము ఫ్లీడరు

ఈ అధ్యాయములో హేమాడ్‌పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూరు బి.ఏ., అనంతరావు పాటంకర్‌ (పూనా), పండరీపురము ప్లీడరు గూర్చిన కథలు చెప్పెను.

ఈ కథలన్నియు నానందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో, ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును.

పస్తావన :

సామాన్యముగ మన గతజన్మ పుణ్య సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది, దానివలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమాడ్‌పంతు తన సంగతినే చెప్పుచున్నాడు.

బొంబాయి దగ్గరగా నున్న బాంద్రాకు ఇతడు చాలాకాలము మేజిస్ట్రేటుగా నుండెను. అక్కడ పీరుమౌలానా యను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను.

అనేకమంది హిందువులు, పారశీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమాడ్‌పంతు పురోహితుడగు ఇనుస్‌, పీరుమౌలానాను దర్శించుమని అనేకసార్లు హేమాడ్‌పంతుకు చెప్పెను.

కాని ఏవో కారణములచేత హేమాడ్‌పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయెను.

అనేక సంవత్సరముల తరువాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను.

దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే యట్టిది లభించును.

యోగీశ్వరుల వ్యవస్థ :

అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ యున్నది. అనేకమంది యోగులనేకచోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు.

వారనేకచోట్ల పనిచేసినను అందరా భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది యింకొకరికి తెలియును.

ఒకరు చేసినదానిని ఇంకొకరు పూర్తిచేసెదరు. దీనిని బోధించుటకొక యుదాహరణ   మీ దిగువ కలదు.

వి.హెచ్‌. (వినాయక హరిశ్చంద్ర) ఠాకూరు :

వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండిరి. ఆయన ఒకానొకప్పుడు బెళగాం సమీపమందలి వడ్‌గాం అను పట్టణమున కొక సర్వేపార్టీతో వచ్చెను.

అక్కడ ‘అప్ప’ యను కన్నడయోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను.

ఆ యోగి నిశ్చలదాసు రచించిన ‘విచారసాగర’ మను వేదాంత గ్రంథమును సభలో నున్నవారికి బోధించుచుండెను.

ఠాకూర్‌ పోవునపుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి. ”ఈ పుస్తకమును నీవు చదువవలెను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును.

ముందు ముందు నీ యుద్యోగమునకు సంబంధించిన పనిమీద ఉత్తర దిక్కునకు బోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము గలుగును.

వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి ఆనందములు కలుగజేసెదరు”

ఆ తరువాత ఠాకూరు జున్నరుకు బదిలీ యయ్యెను.

అచ్చటికి పోవుటకై నాన్హే ఘాటు లోయను దాటి పోవలసియుండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుట కెనుబోతు తప్ప యితర మేదియు నుపయోగించరు.

కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చటి నుండి కల్యాణ్‌కు పెద్ద యుద్యోగముపై బదిలీ యయ్యెను. అచట నానాసాహెబు చాందోర్కరుతో పరిచయము కలిగెను.

ఆయన వలన సాయిబాబా గూర్చి యనేక సంగతులు తెలిసికొని వారిని దర్శింప కాంక్షించెను.

ఆ మరుసటి దినమే నానాసాహెబు షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును కూడా తనతో రమ్మని యడిగెను.

ఠాకూర్‌ తనకు ఠాణాలో సివిల్‌ కేసుండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబు ఒక్కడే వెళ్ళెను.

ఠాకూరు ఠాణాకు వెళ్ళెను. కాని యచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబు వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికి షిరిడీ వెళ్ళెను.

అంతకు ముందురోజే నానాసాహెబు షిరిడీ విడిచి పెట్టెనని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూరును బాబా వద్దకు దీసికొని పోయిరి.

అతడు బాబాను జూచి, వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతని కండ్లు ఆనందబాష్పములచే నిండెను, ఒడలు గగుర్పొడిచెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా యిట్లనెను.

”ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు. నాన్హేఘాటులో ఎనుబోతుపైన సవారి చేయుటకంటే కష్టము ! ఈ యధ్యాత్మమార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము”.

ఠాకూరుకొక్కనికే అర్థమగు ఆ మాటలు వినగనే యతడు యమితానంద పరవశుడయ్యెను.

కన్నడయోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును బెట్టి, తనను స్వీకరించి యాశీర్వదించవలెనని ప్రార్థించెను.

అప్పుడు బాబా యిట్లనెను. ”అప్పా చెప్పినదంతయు నిజమే! కాని యవన్నియు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు.

నీవు చదివిన విషయమును గూర్చి జాగర్తగ విచారించి, అర్ధము జేసుకుని, యాచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనము లేదు. గుర్వనుగ్రహము లేని ఉత్త పుస్తకజ్ఞానము నిష్ప్రయోజనము.”

విచారసాగరములోని సిద్ధాంత భాగమాతడు చదివియుండెను. కాని ఆచరణను షిరిడీలో నేర్చెను.

ఈ దిగువ చెప్పిన యింకొక కథ కూడ నీ సత్యమును బలపరచును.

అనంతరావు పాటంకర్‌ :

అనంతరావు పాటంకర్‌ యను పూనా పెద్దమనుష్యుడొకడు బాబాను చూడగోరెను. షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేసెను. అతని కండ్లు సంతుష్టి చెందెను. అతడానందించెను.

అతడు బాబా పాదములపయి బడి, తగు విధముగ పూజించి, పిమ్మట బాబాతో ఇట్లనెను.

”నేనెక్కువగా చదివితిని. వేదములను, వేదాంతములను చదివితిని. అష్టాదశ పురాణములు వింటిని. నా మనస్సునకు శాంతి కలుగుటలేదు.

కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాండంబర భక్తులు నా కంటె మేలు.

మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని.

అందుచే నేనిచ్చిటికి వచ్చితిని. కావున నాయందు దాక్షిణ్యము చూపుము. నన్ను ఆశీర్వదించుము”.

అప్పుడు బాబా ఒక నీతికథను ఈ విధముగా చెప్పెను :

నవవిధభక్తి (తొమ్మిది ఉండల గుఱ్ఱపు లద్ది నీతికథ) :

”ఒకనాడొక వర్తకుడిక్కడకు వచ్చెను. అతని ముందు ఒక ఆడగుఱ్ఱము లద్దివేసెను.

అది తొమ్మిది యుండలుగా పడెను. జిజ్ఞాసువైన యా వర్తకుడు పంచెకొంగు సాచి తొమ్మిది యుండల నందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను”.

ఈ మాటల యర్ధమును పాటంకర్‌ గ్రహించలేకుండెను. అందుచే నతడు గణేశదామోదర్‌ వురఫ్‌ దాదాకేల్కరు నిట్లు అడిగెను :

‘ఆ మాటలలో బాబా యుద్దేశమేమి ?” కేల్కరు యిట్లు జవాబు ఇచ్చెను : ”నాకు కూడ బాబా చెప్పినదంతయు తెలియదు గాని, వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను.

ఆడగుఱ్ఱమనగా ఇచట భగవంతుని యనుగ్రహము. తొమ్మిది యుండల లద్ది యనగా నవవిధ భక్తులు.

అవి యేవన 1. శ్రవణము (వినుట) 2. కీర్తనము (ప్రార్థించుట) 3. స్మరణము (జ్ఞప్తియందుంచుకొనుట) 4. పాదసేవనము (పాద సంవాహనము) 5. అర్చనము (పూజ) 6. నమస్కారము (వంగి నమస్కరించుట) 7. దాస్యము (సేవ) 8. సఖ్యత్వము (స్నేహము) 9. ఆత్మనివేదనము (ఆత్మను సమర్పించుట).

”ఇవి నవవిధ భక్తులు. వీనిలో నేదయిన ఒక మార్గమును హృదయ పూర్వకముగ అనుసరించిన యెడల భగవంతుడు సంతుష్టి జెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును.

భక్తిలేని సాధనములన్నియు అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని సంగతుల నితరులకు బోధించుట మొ.నవి నిష్ప్రయోజనము.

భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన, ఇవన్నియు వ్యర్థము.

కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే. నీవు కూడ ఆ వర్తకుడననుకొనుము. లేదా సత్యమును దెలిసికొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తిననుకొనుము.

వానివలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము. ఆతురతతో నుండుము. వానివలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనః స్థైర్యము, శాంతి కలుగును”.

ఆ మరుసటి దినము పాటంకర్‌ బాబాకు నమస్కరించుటకు పోగా, ”తొమ్మిది గుఱ్ఱపులద్ది ఉండలను ప్రోగుచేసితివా లేదా ‘‘? యని ప్రశ్నించెను.

అతడు తాను నిస్సహాయుడననియు, బాబా అనుగ్రహముచే మాత్రమే వానిని సులభముగా ప్రోగుచేయవచ్చుననెను.

అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని యాశీర్వదించెను. పాటంకర్‌ యపరిమితానంద భరితుడయ్యెను.

పండరీపురము ప్లీడరు :

ఒక చిన్నకథతో నీ అధ్యాయమును ముగించెదము. ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును.

ప్రజలను సరియైన మార్గమున బెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు, బాబా సర్వజ్ఞత్వము నుపయోగించుచుండెను.

ఒకనాడు పండరీపురము నుండి యొక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను;

వారి పాదములకు నమస్కరించెను; అడుగకుండనే దక్షిణ యిచ్చెను; జరుగుచున్న సంభాషణలు వినుటకొక మూల గూర్చుండెను. బాబా యతనివైపు ముఖము త్రిప్పి యిట్లనెను.

”ప్రజలెంత టక్కరులు ? వారు పాదములపయి బడెదరు. దక్షిణ నిచ్చెదరు. కానీ, చాటుగ నిందించెదరు. ఇది చిత్రము గాదా ?”

ఆ మాటలు ప్లీడరుకు సూటిగ తగిలినవి. ఎవరికీ బాబా మాటలలోని అంతరార్ధము బోధపడలేదు. ప్లీడరు మాత్రము గ్రహించెను.

కాని అక్కడ యేమియు మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబు దీక్షితుతో ఇట్లనియెను :

”బాబా చెప్పినదంతయు యదార్థమే. ఆ బాణము నాపయి ప్రయోగించిరి. అది నా గూర్చియే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది.

పండరీపురము సబ్‌జడ్జియగు నూల్కర్‌ తన యారోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. ఇచ్చటనే మకాము చేసెను.

ప్లీడర్ల విశ్రాంతిగదిలో దీని గూర్చి వివాదము జరిగెను. రోగముచే బాధపడుచున్న సబ్‌జడ్జి యౌషధమును సేవించక, షిరిడీకి పోయిన మాత్రమున బాగగునా? అని మాట్లాడుకొనిరి.

సబ్‌జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడ అందు కొంత భాగము వహించితిని. నేను చేసినది సమంజసము గాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను.

ఇది నాకు దూషణ కాదు. నాకిది యాశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరిని దూషించరాదు. ఎవరిని నిందించరాదు. ఇతరుల విషయములో జోక్యము కలుగజేసి కొనరాదు”.

పండరీపురమునకు షిరిడీ మూడు వందల మైళ్ళ దూరమున నున్నది.  బాబా సర్వజ్ఞుగుటచే పండరీపురములో ప్లీడర్ల విశ్రాంతిగదిలో నేమి జరిగెనో తెలిసికొనిరి.

ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞత్వమున కడ్డుపడలేదు.

వారు సర్వమును జూడగలిగిరి. అందరి హృదయములలో గలదానిని చదువగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియు లేదు.

దగ్గర నున్నవి దూరముగ నున్నవి ప్రతి వస్తువు కూడ పగటి కాంతివలె వారికి తేటతెల్లము.

ఎవడయిన దూరముగా గాని దగ్గరగా గాని యుండనిమ్ము. బాబా సర్వాంతర్యామి యగుటచే వారి దృష్టినుంచి తప్పించుకొనుటకు వీలులేదు.

దీనిని బట్టి ప్లీడరొక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు. మరియు ననవసరముగ వ్యాఖ్యానము చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను.

ఇది యొక ప్లీడరును గూర్చినదైనప్పటికి అందరికి వర్తించును. కాబట్టి యీ కథ బోధించు నీతిని జ్ఞప్తియందుంచుకొని మేలు పొందెదము గాక.

సాయిబాబా మహిమ అగాధము, వారి లీలలు కూడ అట్టివే. వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క యవతారమే.

ఇరువది యొకటవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles