🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది ఐదవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

ఇరువది ఐదవ అధ్యాయము

దామోదర్‌ సావల్‌రాం రాసనే – జట్టీ వ్యాపారములు;

ఆమ్రలీల; ప్రార్థన

భగవదవతారమును, పరబ్రహ్మ స్వరూపుడును, మహా యోగిశ్వరుడును, కరుణాసాగరుడును అగు శ్రీసాయినాథునకు సాష్టాంగ నమస్కారము లొనర్చి ఈ అధ్యాయమును ప్రారంభించెదము.

యోగిచూడామణియగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక ! సమస్త శుభములకు నిలయము, మన ఆత్మారాముడు, భక్తులపాలిటి ఆశ్రయదాత యగు సాయికి జయమగుగాక. జీవితాశయమును, పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు.

సాయిబాబా యెల్లప్పుడు కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారియందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణభక్తి యున్నప్పుడు వారి కోరికలన్నియు శీఘ్రముగా నెరవేరును.

హేమాడ్‌పంతు మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయు కోరిక జనించగనే, బాబా వెంటనే అతనిచే వ్రాయించెను.

సంగ్రహముగా సంగతులు వ్రాసికొనుమని బాబా యాజ్ఞ యిచ్చిన వెంటనే హేమాడ్‌పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను.

దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానినతడు పూర్తి చేయగలిగెను. ఈవిధముగా సచ్చరిత్ర సిద్ధమైనది.

అదియొక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయిలీలలను అమృతము స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును.

భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన, హృదయ పూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను.

అహమద్‌నగర్‌ నివాసియగు (ప్రస్తుతము పూనావాసి) దామోదర్‌ సావల్‌ రాం రాసనే కాసార్‌ వురఫ్‌ దాము అన్నా కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువ నివ్వబడినది.

దాము అన్నా (దామోదర్‌ సావల్‌రాం రాసనే) :

6వ అధ్యాయములో శ్రీరామనవమి యుత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తియందుంచుకొనియే యుందురు.

అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమినాడు ఉరుసు యుత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను.

అప్పటినుండి ఇప్పటివరకు అలంకరించిన పతాక మొకటి కానుకగా నిచ్చుచున్నాడు. అదియునుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు.

అతని జట్టీ వ్యాపారములు : ప్రత్తి :

బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు, ప్రత్తిలో జట్టీ వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభము సంపాదించ వలెనని వ్రాసెను.

వ్యాపారము లాభకరమైనదనియు, నెంత మాత్రము ప్రమాదకరము కాదనియు, గనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను.

దాము అన్నా యా బేరమును చేయుటయా ? మానుటయా? యను నాందోళన పడెను. జట్టీ వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించు కొనలేకుండెను.

దాని గూర్చి బాగుగ  ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామా కొక జాబు సవివరముగా వ్రాసి బాబా నడిగి వారి సలహాను తెలిసికొనుమనెను.

ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామా దానిని తీసుకొని మసీదుకు బోయెను. బాబా ముందర బెట్టెను.

బాబా యా కాగితమేమని యడిగెను. సమాచార మేమనెను ? శ్యామా అహమద్‌నగరు నుండి దాము అన్నా యేదో కనుగొనుటకు వ్రాసినాడనెను.

బాబా యిట్లనెను. ”ఏమి వ్రాయుచున్నాడు ? ఏమి యెత్తు వేయుచున్నాడు? భగవంతుడిచ్చినదానితో సంతుష్టి జెందక యాకాశమున కెగుర ప్రయత్నించు చున్నట్లున్నది. వాని యుత్తరము చదువుము ”

బాబా చెప్పినదే ఆ యుత్తరములో గల సమాచారమని, శ్యామా “దేవా ! నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని, భక్తుల నాందోళనపాలు చేసెదవు. వారు వ్యాకులులగుటతో, వారి నిచట కీడ్చుకొని వచ్చెదవు.

కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు ?” అనెను.

బాబా ”ఓ శ్యామా ! దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడెదను. నన్ను విశ్వసించు వారెవ్వరు ?” అనెను.

అప్పుడు శ్యామా ఉత్తరమును చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనెను.

”సేటుకు పిచ్చి యెత్తినది. అతని గృహమందేలోటు లేదని వ్రాయుము. తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయుము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము”.

శ్యామా జవాబు పంపెను. దానికొర కాతురతతో దాము అన్నా కనిపెట్టుకొని యుండెను.

జాబు చదువుకొని అతడు తన యాశయంతయు అడియాస యైనదనుకొనెను.

కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామా వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని యనుకొనెను.

అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచు కూర్చుండెను.

అతనికి బాబాను బహిరంగముగా జట్టీ వ్యాపారము గూర్చి యడుగుటకు ధైర్యము చాలకుండెను.

బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబా కిచ్చినచో బాగుండు ననుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్నా తన మనస్సున ననుకొనెను.

బాబాకు తెలియనిదేమియు లేదు. అరచేతనున్న యుసిరికాయవలె భూత భవిష్యత్‌ వర్తమానములు కూడ బాబా తెలిసినవారు.

బిడ్డకు తీపి వస్తువులు కావలయును. కాని తల్లి చేదుమాత్ర లిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును జెరచును. చేదుమాత్ర లారోగ్యమును వృద్ధిచేయును.

తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదుమాత్రలే యిచ్చును. బాబా దయగల తల్లివంటివారు.

తన భక్తుల భవిష్యత్‌ వర్తమానముల లాభముల గూర్చి బాగుగా దెలిసినవారు. దాము అన్నా మనస్సును గనిపెట్టి బాబా యిట్లనెను.

”ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నా కిష్టము లేదు”. బాబా యొక్క యసమ్మతి గ్రహించి దాము అన్నా యా పనిని మానుకొనెను.

ధాన్యముల బేరము :

పిమ్మట దాము అన్నా ధాన్యము వ్యాపారము చేయ తలపెట్టెను.

ఈ యాలోచన కూడ బాబా గ్రహించి ”నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక నీ వ్యాపారము కూడ మానుకొను’‘మనెను.

కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగానే యుండెను. కాని యొక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను.

ధాన్యములు నిలువచేసినవారెల్ల నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్నా కాపాడబడెను. ప్రత్తి జట్టీ వ్యాపారము కూడ కూలిపోయెను.

ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను.

బాబా తనను రెండుసారులు గొప్ప నష్టముల నుండి తప్పించెనని, దాము అన్నాకు బాబా యందు గల నమ్మకము హెచ్చెను.

బాబా మహాసమాధి చెందువరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట గూడ భక్తితో నున్నాడు.

ఆమ్రలీల (మామిడిపండ్ల చమత్కారము) :

ఒకనాడు 300 మామిడిపండ్ల పార్సిలు వచ్చెను. రాళేయను మామలతదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను.

అది తెరుచునప్పటికి పండ్లన్నియు బాగానే యుండెను. అది శ్యామా స్వాధీనములో పెట్టిరి.

అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబలో (కుండలో) పెట్టెను. బాబా ఈ నాలుగు దాము అన్నాకు, అవి యక్కడనే యుండవలె” ననెను.

దాము అన్నాకు ఇద్దరు భార్యలు గలరు. కాని యతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను.

అతడు కూడ జ్యోతిషమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావ ముండుటచే అతనికి సంతానము కలుగు నవకాశము లేదనుకొనెను.

కాని అతనికి బాబాయందు మిక్కిలి నమ్మకము గలదు. మామిడిపండ్లు అందిన రెండు గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా యిట్లనెను.

”అందరు మామిడి పండ్ల వైపు చూచుచున్నారు. కాని అవి దాము కొరకుంచినవి. కావున అవి దామ్యా తిని చావవలెను”.

దాము ఈ మాటలు విని భయపడెను. కాని మహల్సాపతి (బాబా ముఖ్య భక్తుడు) దానినిట్లు సమర్థించెను.

”చావనునది యహంకారమును గూర్చి. దానిని బాబా ముందు చంపుట యొక యాశీర్వాదము”.

బాబా యతనితో నిట్లనియె: ”నీవు తినవద్దు. నీ చిన్న భార్యకిమ్ము. ఈ యామ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను, నలుగురు కుమార్తెలను ప్రసాదించును”.

దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను. జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను.

బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు గూడ వారి మహత్మ్యమును స్థాపించుచున్నవి.

బాబా యిట్లనెను.

”సమాధి చెందినప్పటికి నా సమాధిలోనుంచి నా యెముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును, విశ్వాసమును కలిగించును.

మనఃపూర్వకముగ నన్ను శరణు జొచ్చినవారితో నా సమాధి కూడ మాట్లాడును. వారి వెన్నంటి కదలును.

నేను మీ వద్ద నుండనేమో యని మీరాందోళన పడవద్దు. నా యెముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు.

నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు !”

హేమాడ్‌పంతు ఈ అధ్యాయము నొక ప్రార్థనతో ముగించుచున్నాడు.

పార్థన :

”ఓ సాయి సద్గురూ ! భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా ! మీ పాదముల మేమెన్నటికి మరువకుందుము గాక. మీ పాదముల నెప్పుడు చూచుచుండెదము గాక.

ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధ పడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము.

మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండ యడ్డుకొనుము. ఇంద్రియములు, మనస్సు బయటకు పోవు నైజము నాపనంతవరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు.

అంత్యకాలమున కొడుకుగాని, భార్యగాని, స్నేహితుడుగాని యుపయోగపడరు. నీవే మాకు ఆనందమును, మోక్షమును కలుగజేయువాడవు.

వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల యాసక్తిని పూర్తిగా నశింపజేయుము. నీ నామ స్మరణము చేయుటకు జిహ్వ యుత్సహించుగాక.

మా యాలోచనలను అవి మంచివే యగుగాక చెడ్డవే యగుగాక తరిమి వేయుము. మా గృహములను శరీరమును మరచునట్లు జేయుము. మా యహంకారమును నిర్మూలింపుము.

నీ నామమే ఎల్లప్పుడు జ్ఞప్తియందుండునటుల చేయుము. తక్కిన వస్తువులన్నిటిని మరచునట్లు జేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము.

నీవు మమ్ములను గట్టిగ పట్టి యుంచినచో యా యజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురు నందు మేము సంతోషముగా నుండెదము.

మమ్ములను నిద్రనుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది”.

నోటు : దాము అన్నా యిచ్చిన వాజ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది.

ఒకనాడనేకమందితో నేను గూడ బాబా పాదముల వద్ద కూర్చొని యున్నప్పుడు, నా మనస్సున రెండు సంశయములు కలిగెను. ఆ రెంటికి బాబా యిట్లు జవాబిచ్చెను.

1. సాయిబాబా వద్ద అనేకమంది గుమిగూడుచున్నారు. వారందరు బాబా వలన మేలు పొందెదరా ?

దీనికి బాబా యిట్లు జవాబిచ్చెను. ”మామిడిచెట్ల వయిపు పూతపూసి యున్నప్పుడు చూడుము. పువ్వులన్నియు పండ్లు అయినచో, నెంత మంచి పంట యగును ? కాని యట్లు జరుగునా ?

పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును. కొన్ని మాత్రమే మిగులును”.

2. ఇది నా గురించి యడిగినది. బాబా భౌతిక శరీరము విడచిన పిమ్మట, నా జీవితమనే ఓడ నెట్లు నడుపగలను ? అది యెటో కొట్టుకొని పోవునా ? అయినచో నా గతి యేమి ?

దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను. ”ఎక్కడైనను నెప్పుడయినను నా గురించి చింతించినచో నేనక్కడనే యుండెదను”. 1918కి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి.

1918 తరువాత కూడ నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే యున్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-1911 కాలములో జరిగెను.

నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నియు నన్ను కల్లోలపరచినవి.

నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు.

నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపజేసి, అప్పా కులకర్ణి యింటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి.

నా యింటిలో దొంగతనము జరిగినది. నాకు ముప్పది సంవత్సరముల నుండి యొక స్నేహితుడుండెను.

అతడు నా భార్య యొక్క నగల పెట్టె దొంగిలించెను. అందులో శుభమగు నత్తు (నాసికాభరణము) ఉండెను. బాబా ఫోటో ముందేడ్చితిని.

ఆ మరుసటి దినమే యా మనిషి నగలపెట్టెను తిరిగి యిచ్చి వేసి క్షమాపణ కోరెను.

ఇరువది యైదవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles