🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹16-17వ అధ్యాయములు🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

మూడవ రోజు పారాయణము

శనివారము

16-17వ అధ్యాయములు

బ్రహ్మ జ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత; బాబా వారి వైశిష్ట్యము

బ్రహ్మజ్ఞానము :

గత అధ్యాయములో చోల్కరు తన మ్రొక్కునెట్లు చెల్లించెనో బాబా దాని నెట్లు ఆమోదించెనో చెప్పితిని.

ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దానిని ఆమోదించెదననియు, గర్వముతోను అహంకారముతోను ఇచ్చిన దానిని తిరస్కరించెదననియు బాబా ఆ కథలో నిరూపించెను.

బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టెడివారు కారు.

ఎవరైన భక్తి ప్రేమలతో నేదైన సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనెడివారు.

నిజముగా సద్గురు సాయి కంటె నుదార స్వభావులు. దయార్ధ్ర హృదయులు లేరు.

కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్ల నిచ్చు కామధేనువు కూడ బాబాతో సమానము కాదు.

ఏలన, యవి మనము కోరినవి మాత్రమే యిచ్చును. కాని సద్గురువు అచింత్యము అనుపలభ్యమునైన ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును.

ఒకనాడొక ధనికుడు(గుల్జార్) సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మ జ్ఞానమును ప్రసాదించుమని బతిమాలెను. ఆ కథ యిచ్చట చెప్పుదును.

సకలైశ్వర్యముల ననుభవించుచున్న ధనికుడోకడుండెను. అతడిండ్లను ధనమును, పొలములను, తోటలను సంపాదించెను.

వాని కనేకమంది సేవకులుండెడివారు. బాబా కీర్తి వాని చెవుల పడగనే షిరిడీకి పోయి బాబా పాదములపైబడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనెదనని తన స్నేహితునితో చెప్పెను.

తనకు వేరేమియు వలదనియు, బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియు చెప్పెను.

ఆ స్నేహితుడిట్లనెను : ”బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైనపని కాదు. ముఖ్యముగా నీవంటి పేరాస గలవానికి అది మిగుల దుర్లభము.

ధనము, భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీవంటివానికి బ్రహ్మజ్ఞానము నెవరిచ్చెదరు? నీవొక పైసయయిన దానము చేయనివాడవే! నీవు బ్రహ్మ జ్ఞానమునకై వెదకునప్పుడు నీ కోరిక నెరవేర్చు వారెవరు?”

తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక, రానుపోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చెను.

మసీదుకు పోయి, బాబాను జూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి యిట్లనెను :

”బాబా ! ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును జూపెదరని విని నేనంత దూరమునుంచి వచ్చితిని.

ప్రయాణముచే నేను మిక్కిలి బడలితిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును”.

బాబా యిట్లు బదులు చెప్పెను. ”నా ప్రియమైన స్నేహితుడా! ఆతుర పడవద్దు. త్వరలో నిప్పుడే నీకు బ్రహ్మమును జూపెదను. నాది నగదు బేరమే గాని యరువు బేరము కాదు.

అనేకమంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగనివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే యడుగుదురు.

నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము నివ్వుమని యడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావలెనని యడుగువారికి లోటు లేనే లేదు.

పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి యరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలెనని యడుగు సమయము శుభమైనది; శ్రేయోదాయకమైనది.

కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించినవాని నన్నింటిని జూపెదను”.

ఇట్లని బాబా వానికి బ్రహ్మమును జూపుటకు మొదలిడెను. వాని నక్కడ కూర్చుండుమని ఏదో సంభాషణలోనికి దించెను.

అప్పటి కాతడు తన ప్రశ్న తానే మరచునట్లు చేసెను. ఒక బాలుని బిలిచి నందు మార్వాడి వద్దకు బోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనెను.

కుఱ్ఱవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటివద్ద లేడనియు వాని యింటి వాకిలికి తాళము వేసి యున్నదనియు చెప్పెను.

కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి యప్పు తెమ్మని బాబా యనెను. ఈసారి కూడ కుఱ్ఱవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకిద్దరు ముగ్గురి వద్దకు పోగా ఫలితము లేకపోయెను.

సాయిబాబా సాక్షాత్‌ పరబ్రహ్మావతారమేయని మనకు తెలియును. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన యవసరమేమి ? వారికి అంత చిన్న మొత్తముతో నేమి పనియని ఎవరైన అడుగవచ్చును.

వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాలా యింటివద్ద లేరని వారికి తెలిసియే యుండును. ఇది యంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చినవాని కొరకై జరిపించి యుందురు.

ఆ పెద్దమనిషి వద్ద నోటుల కట్ట యుండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసియున్నచో, బాబా అంత ప్రయాస పడుచున్నప్పుడత డూరకనే కూర్చుండదు.

బాబా యా పైకమును తిరిగి యిచ్చి వేయునని కూడ వానికి తెలియును. అంత చిన్న మొత్తమయినప్పటికిని వాడు తెగించి యివ్వలేకపోయెను.

అట్టివానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలెనట ! నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడెవడైనను వెంటనే 5 రూపాయలు తీసి యిచ్చియుండునే కాని ప్రేక్షకుని వలె ఊరకే చూచుచు కూర్చుని యుండదు.

ఈ పెద్దమనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానమివ్వుమని తొందరపెట్టుచుండెను.

అప్పుడు బాబా యిట్లనెను : ”ఓ మిత్రుడా ! నేను నడుపుచున్నదాని నంతటిని గ్రహించలేకుంటివా యేమి ? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును జూచుటకై యిదంతయు జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయమిది.

బ్రహ్మమును జూచుటకు 5 వస్తువులు సమర్పించవలెను.” అవి యేవన : 1. పంచ ప్రాణములు; 2. పంచేంద్రియములు; 3. మనస్సు; 4. బుద్ధి; 5. అహంకారము,

బ్రహ్మజ్ఞానము లేదా యాత్మసాక్షాత్కారమునకు బోవు దారి చాల కఠినమయినది. అది కత్తివాదరవలె మిక్కిలి పదునైనది.”

అట్లనుచు బాబా యీ విషయమునకు సంబంధించిన సంగతులన్నియు జెప్పెను. వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరచితిమి:

బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత :

అందరును తమ జీవితములో బ్రహ్మమును జూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము.

1. ముముక్షుత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమయిన కోరిక :

ఎవడయితే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమున కర్హుడు.

2. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట :

ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు జెందిన గాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు.

3. అంతర్ముఖత (లోనికి జూచుట) :

మన ఇంద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించి యున్నాడు. కనుక మనుష్యుడెప్పుడును బయట నున్న వానిని చూచును.

కాని ఆత్మ సాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న యాత్మను ఏకధ్యానముతో జూడవలయును.

4. పాపవిమోచన పొందుట :

మనుష్యుడు దుర్మార్గమార్గము నుండి బుద్ధిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సు చలింపకుండ నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడ ఆత్మసాక్షాత్కారమును పొందలేడు.

5. సరియయిన నడవడి :

ఎల్లప్పుడు సత్యమును పలుకుచు, తపస్సు చేయుచు, లోన జూచుచు బ్రహ్మచారిగ నుండినగాని ఆత్మసాక్షాత్కారము లభించదు.

6.ప్రియమైన వాని కంటె శ్రేయస్కరమైన వానిని కోరుట :

లోకములో రెండు తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది; రెండవది ప్రీతికరమయినది.

మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది. రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును.

వీనిలో నొకదానినే అతడెంచుకొనవలెను. తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు రెండవ దానిని కోరును.

7. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట :

శరీరము రథము; ఆత్మ దాని యజమాని; బుద్ధి ఆ రథమును నడుపు సారథి; మనస్సు కళ్ళెము; ఇంద్రియములు గుఱ్ఱములు; ఇంద్రియ విషయములు వాని మార్గములు.

ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమయినదో, ఎవరి యింద్రియములు అస్వాధీనములో (బండి తోలువాని దుర్మార్గపు గుఱ్ఱముల వలె) వాడు గమ్యస్థానమును చేరలేడు. చావు పుట్టుకల చక్రములో పడిపోవును.

ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి యింద్రియములు స్వాధీనమందుండునో (బండి నడుపువాని మంచి గుఱ్ఱమువలె) ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు; విష్ణుపదమును చేరగలడు.

8. మనస్సును పావనము చేయుట :

మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా, ఫలాపేక్ష లేకుండ నిర్వర్తించని యెడల నతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే యతడు యాత్మసాక్షాత్కారము పొందలేడు.

పావనమైన మనస్సులోనే వివేకము (అనగా సత్యమైనదానిని యసత్యమైన దానిని కనుగొనుట) వైరాగ్యము (అసత్యమైన దాని యందభిమానము లేకుండుట) మొలకలెత్తి క్రమముగా ఆత్మ సాక్షాత్కారమునకు దారితీయును.

అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడచిపెట్టనిదే, ఆత్మ సాక్షాత్కారమున కవకాశము లేదు.

దేహమే ‘నేన’ నుకొనుట గొప్ప భ్రమ. ఈ యభిప్రాయమందభిమానముండుటయే బంధమునకు కారణము. నీవాత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో యీ యభిమానమును విడువవలెను.

9. గురువు యొక్క యావశ్యకత:

ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమైనది. ఎవ్వరైనను తమ స్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు.

కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన యింకొకరి (గురువు) సహాయము మిక్కిలి యవసరము.

గొప్ప కృషి చేసి, శ్రమించి ఇతరులివ్వలేని దాని నతిసులభముగా గురువునుండి పొందవచ్చును.

వారా మార్గమందు నడచియున్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి యింకొక పై మెట్టునకు తీసికొని పోగలరు.

10. భగవంతుని కటాక్షము :

ఇది యన్నికంటె మిక్కిలి యవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైనవారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపజేయగలడు.

”వేదము లభ్యసించుటవల్ల గాని మేధాశక్తి వల్లగాని పుస్తక జ్ఞానము వల్ల గాని యాత్మానుభూతి పొందలేరు. ఆత్మ యెవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికే యాత్మ తన స్వరూపమును తెలియజేయు” నని కఠోపనిషత్తు చెప్పుచున్నది.

ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా యా పెద్దమనుష్యుని వైపు తిరిగి ”అయ్యా ! నీ జేబులో బ్రహ్మము యాబదింతలు 10 రూపాయల నోట్ల రూపముతో (250) నున్నది. దయచేసి దానిని బయటకు దీయుము” అనెను.

ఆ పెద్ద మనుష్యుడు తన జేబు నుంచి నోట్లకట్టను బయటకు దీసెను. లెక్కపెట్టగా సరిగా 25 పదిరూపాయల నోట్లుండెను. అందరు మిక్కిలి యాశ్చర్యపడిరి.

బాబా సర్వజ్ఞతను జూచి వాని మనస్సు కరగెను. బాబా పాదములపైబడి వారి యాశీర్వాదమునకై వేడెను.

అప్పుడు బాబా యిట్లనెను. ”నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టి పెట్టుము. నీ పేరాసను, లోభమును పూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు.

ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమైయున్నదో, వాడా యభిమానమును పోగొట్టునంతవరకు బ్రహ్మము నెట్లు పొందగలడు?

అభిమానమనే భ్రమ, ధనమందు తృష్ణ, దుఃఖమను సుడిగుండము వంటిది. అది యసూయ యహంభావమను మొసళ్ళతో నిండియున్నది.

ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాసయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధవైరము గలవి.”

ఎక్కడ పేరాస గలదో యక్కడ బ్రహ్మము గూర్చి యాలోచించుటకు గాని, దాని ధ్యానమునకు గాని తావులేదు. అట్లయినచో పేరాసగలవాడు విరక్తిని, మోక్షమును ఎట్లు సంపాదించగలడు ?

లోభికి భ్రాంతి గాని, సంతుష్టిగాని, దృఢ నిశ్చయముగాని యుండవు. మనస్సునందేమాత్రము పేరాసయున్నను సాధనలన్నియు (ఆధ్యాత్మిక ప్రయత్నములు) నిష్ప్రయోజనములు.

ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వానియందు విరక్తి లేదో యట్టివాడు గొప్ప చదువరియైనప్పటికి వాని జ్ఞానమెందుకు పనికిరానిది.

ఆత్మసాక్షాత్కారము పొందుట కిది వానికి సహాయపడదు. ఎవరహంకారపూరితులో, ఎవరింద్రియ విషయముల గూర్చి యెల్లప్పుడు చింతించెదరో, వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు.

మనస్సును పవిత్రమొనర్చుట తప్పనిసరి యవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నియు ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును.

కావున దేనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను.

నా ఖజానా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా ? యని నేను మొదట పరీక్షించవలెను. 

నేను చెప్పినదానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను !”

ఒక యతిథిని ఇంటికి బిలిచినప్పుడు ఇంటిలోనివారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు గూడ అతిథితో పాటు విందులో పాల్గొందురు.

కావున నప్పుడు మసీదులో నున్నవారందరు బాబా ఆ పెద్ద మనుష్యునకు చేసిన యీ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి.

బాబా యాశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట నున్నవారందరును, ఆ పెద్దమనిషితో సహా, మిక్కిలి సంతోషముతో సంతుష్టి చెందినవారై వెళ్ళిపోయిరి.

బాబావారి వైశిష్ట్యము :

అనేకమంది సన్యాసులు ఇండ్లు విడచి యడవులలోని గుహలలోను, ఆశ్రమములలోను, నొంటరిగా నుండి జన్మరాహిత్యమునుగాని, మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు.

వారితరుల గూర్చి యాలోచించక ఆత్మానుసంధానమందే మునిగి యుందురు. సాయిబాబా అట్టివారు కారు.

బాబాకు ఇల్లుగాని, భార్యగాని, సంతానముగాని, బంధువులు గానిలేరు. అయినప్పటికి వారు సమాజములోనే యుండెడివారు.

బాబా నాలుగయిదిండ్ల నుండి భిక్షచేసి ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చొనెడువారు.

లౌకిక విషయములందు మగ్నులైన జనులకు, ఈ ప్రపంచములో నెట్లు ప్రవర్తించ వలయునో బోధించెడువారు.

ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట గూడ ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి యరుదు. అట్టివారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు.

కనుక హేమాడ్‌పంతు ఇట్లు చెప్పెను. ”ఏ దేశమునందు సాయిబాబా యను యీ అపూర్వము అమూల్యము యైన పవిత్రరత్నము పుట్టినదో యా దేశము ధన్యము ! ఏ కుటుంబములో వీరు పుట్టిరో యదియు ధన్యము ! ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు !”

16-17 అధ్యాయములు సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles